ఏపీలో అధికార పార్టీ గా మారాలని బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా, వివిధ పార్టీలతో ఇప్పటికీ పొత్తుపెట్టుకుని తమ కోరికను తీర్చుకుంటుంది.
కానీ ఎప్పటికైనా ఏపీలో బలమైన పార్టీగా ముద్ర వేయించుకునేందుకు బిజెపి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ వల్ల తెలుగుదేశం పార్టీ బాగా బలపడుతుందని, బిజెపి బలహీనం అవుతుందని గుర్తించిన ఆ పార్టీ అధిష్టానం ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వీర్రాజు ను బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది.
అయినా ఆయన ప్రభావం పెద్దగా కనిపించలేదు.బిజెపి కి ఓటు బ్యాంకు పెరగకపోవడం, గతంలో మాదిరిగా అంతగా ప్రభావం చూపించ లేని స్థాయిలో ఉండడం, ఏపీ లో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఫలితాలలోనూ ఏ ప్రభావం చూపించలేక పోవడం ఎలా ఎన్నో కారణాలతో బీజేపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది.
దీనికితోడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ బీజేపీ కి శాపంగా మారాయి.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ధరల పెరుగుదల, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇలా చెప్పుకుంటూ వెళితే, చాలా అంశాలే ఏపీ బీజేపీ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి.
దీనికితోడు జనసేన పార్టీ తో పొత్తు ఉన్న బిజెపి ఆ పార్టీని కలుపుకు వెళ్లకపోవడం, విడివిడిగా రెండు పార్టీలు వైసీపీ ప్రభుత్వం పై పోరాడుతూ ఉండడం వంటివి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడతున్నాయి.జనసేన పార్టీకి నాయకత్వ లోపం ఉన్న, క్షేత్ర స్థాయిలో బలమైన జనసైనికుల బలం ఉంది.
పవన్ ఆదేశాలు ఉన్నా, లేకపోయినా, పార్టీని జనాల్లోకి తీసుకు వెళ్తూ ఉంటారు.అంతే కాదు ఇటీవల జరిగిన ఎంపీటీసీ , జడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి కంటే జనసేన ప్రభావం బాగా కనిపించింది.రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా జనసేన మారే అవకాశం కనిపిస్తోంది.అయినా అటువంటి పార్టీని కలుపుకుని వెళ్లే ఆలోచన చేయకపోవడం ఇలా ఎన్నో అంశాలు ఆ పార్టీ కి ఏపీలో స్థానం లేకుండా చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.