భారత్ సహా పలు దేశాల్లో వివిధ బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సేవలు అందించే అంతర్జాతీయ సంస్థ ‘మాస్టర్ కార్డ్’కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే.మాస్టర్ కార్డులపై ఆంక్షలు విధించింది.
కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.స్థానికంగా డేటా నిల్వ చేయాలనే నిబంధనలను పాటించలేదనే కారణంతో జూలై 22 నుంచి కొత్తగా కార్డులు (డెబిట్, క్రెడిట్, ప్రీ-పెయిడ్) జారీ చేయరాదని మాస్టర్కార్డును ఆర్బీఐ నిషేధించింది.
ఈ పరిణామం దేశీయ ‘రూపే’ కార్డుకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నప్పటికీ మాస్టర్కార్డ్పై నిషేధం వల్ల దేశీయంగా ఐదు బ్యాంకులు, ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ, మరొక కార్డుల జారీ సంస్థ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఆర్బీఐ నిర్ణయం పట్ల అమెరికా ట్రేడ్ డిపార్ట్మెంట్ సైతం పెదవి విరుస్తోంది.
అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్కు యూఎస్ ట్రేడ్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి పంపిన ఈ మెయిల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇది తీవ్ర భయాందోళన కలిగించే చర్యగా సదరు అధికారి పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో తొలుత అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్స్ సంస్థలపైనా ఆర్బీఐ ఇదే రకమైన నిషేధాన్ని విధించినప్పుడు సైతం అమెరికా ట్రేడ్ వర్గాలు అసహనానికి గురయ్యాయట.స్థానిక డేటా నిల్వ నిబంధనలను ఈ కంపెనీలు ఉల్లంఘించాయన్నది ఆర్బీఐ ప్రధాన ఆరోపణ.
మాస్టర్ కార్డ్పై నిషేధం తర్వాత యూఎస్ ట్రేడ్ అధికారులు ఆర్బీఐతో పాటు మాస్టర్ కార్డ్తోనూ సమస్య పరిష్కారమయ్యే దిశగా చర్చలు జరిపారు.కానీ ఆర్బీఐ నిర్ణయంపై అమెరికా ప్రభుత్వం బహిరంగంగా తన స్పందన తెలియజేయలేదు.
గత రెండు రోజులుగా ఆర్బీఐ తీసుకున్న కొన్ని కఠినమైన చర్యల గురించి చర్చిస్తున్నట్లు దక్షిణ, మధ్యాసియా యూఎస్ ట్రేడ్ ప్రతినిధి బ్రెండన్ ఏ లించ్.రాయిటర్స్కు పంపిన ఈ మెయిల్లో వెల్లడించారు.
మాస్టర్ కార్డ్తో పాటు అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్ సైతం భారత్ చర్యల వల్ల ప్రభావితమైనట్లు ఆయన తెలిపారు.ఇక ఇదే అంశంపై మాస్టర్ కార్డ్ ప్రతినిధి రాయిటర్స్తో మాట్లాడుతూ.
తాము గడిచిన కొన్ని వారాలుగా భారత్, అమెరికా ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.దీనికి అనుబంధంగా ఆర్బీఐతోనూ చర్చలు వున్నాయన్నారు.
ఈ విషయంలో మాస్టర్కార్డ్కు సానుకూల స్పందన లభించిందని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మాస్టర్ కార్డ్ భారత్ను కీలక వృద్ధి మార్కెట్గా పరిగణిస్తోంది.ఇక్కడ ఆ సంస్థ పెద్ద మొత్తంలో పెట్టుబడులతో పాటు పరిశోధన, సాంకేతి కేంద్రాలను నెలకొల్పింది.ఆర్బీఐ నిర్ణయం కంపెనీని కుదిపేసింది.
కార్డ్లను జారీ చేయడానికి కొత్త నెట్వర్క్లతో పనిచేసేందుకు శ్రమిస్తున్న వేళ ఇప్పటికే మాస్టర్ కార్డ్తో భాగస్వామ్యం వున్న భారతీయ బ్యాంకులు తమ ఆదాయం దెబ్బ తింటుందనే ఆందోళనలో వున్నాయి.ఆర్బీఐ విధించిన నిషేధం అమల్లోకి రాకముందే భారతదేశ కేంద్ర బ్యాంకుకు తాము ఆడిట్ నివేదిక సమర్పించినట్లు మాస్టర్ కార్డ్ రాయిటర్స్కి తెలిపింది.