2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్ని చరిత్ర మరవలేదు.అత్యంత శక్తివంతమైన అమెరికాపై ఉగ్రదాడితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి.
సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు.న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం, జూన్ 2019 నాటికి అగ్నిమాపక దళ సిబ్బంది మరియు పోలీసులు సహా రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మరణించారు.
రెండు భవనాల్లో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు.ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు.
మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే.వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.
దీంతో బిన్లాడెన్, అల్ఖైదాలపై పగబట్టిన అమెరికా..
ఆఫ్ఘన్ గడ్డపై దిగి భీకర దాడులు చేసింది.పదేళ్ల పాటు నింగీ, నేల, పాతాళంలో గాలించి పాక్లోని అబోట్టాబాద్లో లాడెన్ను హతమార్చింది.
అల్ఖైదా దాడి చేసి ఈ నెల 21కి సరిగ్గా 20 ఏళ్లు నిండాయి.ఈ ఘటనలో మరణించిన ప్రజలు, సైనికులు, ఇతర సిబ్బందికి వారి కుటుంబ సభ్యులతో పాటు అమెరికన్లు నివాళులర్పించారు.అయితే ఈ దాడి తర్వాత ముస్లింలు, దక్షిణాసియా వాసులు, సిక్కులపై విద్వేషదాడులు పెరిగిపోయాయి.భౌతిక దాడులతో పాటు వారిని చంపేందుకు కూడా అమెరికన్లు వెనుకాడలేదు.అలాంటి ఒక ఘటనలో మరణించిన సిక్కు వ్యక్తి బల్బీర్ సింగ్కు అతని కుటుంబం శ్రద్ధాంజలి ఘటించింది.ఈ సందర్భంగా ఆయనకు అమెరికా అగ్రశ్రేణి చట్టసభ సభ్యులు సైతం నివాళులర్పించారు.
వీరిలో సెనేటర్లు రాబర్ట్ మెనెండెజ్, డిక్ డర్బిన్, షెర్రోడ్ బ్రౌన్, రిచర్డ్ బ్లూమెంటల్తో పాటు కాంగ్రెస్ సభ్యుడు డోనాల్డ్ నార్క్రాస్ వున్నారు.
9/11 దాడులు జరిగిన నాలుగు రోజుల తర్వాత బల్బీర్ సింగ్ను ఆరిజోనాలోని గ్యాస్ స్టేషన్ వెలుపల ఓ స్థానిక అమెరికన్ కాల్చిచంపాడు.ఉగ్రదాడులకు ప్రతీకారంగా హత్యకు గురైన తొలి వ్యక్తిగా బల్బీర్ సింగ్ సోదీ నిలిచిపోయారు.బల్బీర్ను చంపిన హంతకుడిని 24 గంటల్లో పట్టుకుని జైల్లో పెట్టారు.
నిందితుడిని ఫ్రాంక్ రోక్గా గుర్తించారు.అతను ప్రస్తుతం కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు.