రాజకీయాల్లో ఎవరి ప్రభావం ఎంత కాలం ఉంటుందో స్పష్టంగా చెప్పలేము.జనాల మూడ్ ను బట్టి నాయకుల జాతకాలు మారిపోతూ ఉంటాయి.
అందుకే ఎప్పుడు శాశ్వతంగా ఏ పార్టీ అధికారంలో ఉండదు.ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం దక్కుతూ ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.సీఎంగా జగన్ ఉన్నారు.
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు వంటి ఉద్దండుడిని ఎదుర్కొని మరీ జగన్ అధికారంలోకి వచ్చారు.అసలు ఏపీలో టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఆ పార్టీ ని పక్కన పెట్టి జనాలంతా అఖండ మెజారిటీతో వైసిపి కి అధికారం తెచ్చిపెట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రజా సంక్షేమ పథకాలతో పాటు సంచలన నిర్ణయాలు తీసుకోవడం వంటివి జనాల్లో ఆయనకు మరింత ఆదరణ తెచ్చిపెట్టాయి.ఇదే టిడిపికి శాపంగా మారింది అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.
జగన్ పైనా వ్యతిరేకత కనిపిస్తోంది.వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత టిడిపికి మేలు చేస్తుందా లేక పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీకి మేలు చేస్తుందా అనే లెక్కలు మొదలయ్యాయి.
ఏపీలో టీడీపీ పరిపాలన ఎలా ఉంటుందో జనాలందరూ చూశారు.ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న అవినీతి, ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇలా అన్నిటిని జనాలు చూశారు.
మళ్లీ ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.ఇదే సమయంలో జనసేన సరైన రూట్లో వెళితే ఆ పార్టీ అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ లో మంచి ఫాలోయింగ్ ఉంది.యూత్ లో ఆయనకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇప్పుడే సరైన అవకాశంగా భావించి పవన్ రంగంలోకి దిగి, వరుసగా ఏపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తూ, నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటే జనసేన గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతుంది.అలాగే పవన్ టిడిపి కి మద్దతుదారుడు అనే అభిప్రాయం ప్రజలోనూ తొలగిపోయేలా చేసుకోవాలి.బిజెపి-టిడిపి లను దూరం పెట్టి జనసేన ప్రజా ఉద్యమాలు చేపట్టడం, ప్రజల్లోనే ఎక్కువగా ఉంటూ వ్యవహారాలు చేస్తే, ఆ పార్టీకి అధికారం రావడం కష్టమేమీ కాదు.