తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పై పొద్దున లేస్తే చాలు కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తూనే ఉంటాయి.ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో, దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడం తో పాటు, వివిధ అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంటాయి.
అలాగే సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు.ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల హడావిడి మొదలు కావడంతో , మరింతగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు.
ఒకవైపు పెద్దఎత్తున సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, నిరంతరం ప్రజల్లో తిరుగుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ బిజెపి నేతలు నిమగ్నం అయ్యారు.మరో వైపు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
మరోవైపు రేవంత్ రెడ్డి సైతం ఇదే తరహాలో విమర్శలు చేస్తూ రావడంతో, టిఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిపోయింది.సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారు.అక్కడ కేంద్ర బిజెపి పెద్దలను కలిసి అనేక విషయాలపై చర్చించారు.ఆయన ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేయడంతో, కేసీఆర్ సూచనలతోనే ఎన్నికలు వాయిదా పడ్డాయనే ప్రచారం ఊపందుకుంది.
అది కాకుండా కేంద్ర బిజెపి పెద్దలు అంతా కేసీఆర్ కు అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వడం, కేసీఆర్ ఈ విషయంలో సానుకూలంగా స్పందించడం, ఇవన్నీ తెలంగాణ బిజెపి నాయకులను ఆత్మరక్షణలో పడేశాయి.ఒకవైపు బండి సంజయ్ పాదయాత్రలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండగా, అదే సమయంలో కెసిఆర్ బిజెపి పెద్దలతో బేటీ అవడం, వారు సానుకూలంగా స్పందించడం ఇవన్నీ తెలంగాణ బిజెపి నాయకులకు ఇబ్బందికరంగా మారాయి.
తెలంగాణలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా, కేంద్రంలో మాత్రం టిఆర్ఎస్ బిజెపి ఒక అంగీకారంతో ముందుకు వెళ్తున్నాయి అనే అభిప్రాయం కలగడం, బండి సంజయ్ పాదయాత్ర పైన పడింది.కాంగ్రెస్ విషయంలోనూ ఇదే రకమైన వైఖరిని అవలంబించారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై కాంగ్రెస్ మొదటి నుంచి తీవ్రంగా విమర్శలు చేస్తోంది.ఈ నేపథ్యంలోనే దళిత బందు పథకం రివ్యూ మీటింగ్ కు సీఎల్పీ నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ను కేసీఆర్ ఆహ్వానించారు.
ఆయన నియోజకవర్గంలోని ఓ మండలం లో రైతుబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించడంతో, ఆయనకు ఆహ్వానం అందింది.మరోవైపు చూస్తే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా రేవంత్ ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోర సబలను నిర్వహిస్తున్న సమయంలో ని బట్టి విక్రమార్క కేసీఆర్ తో సమావేశానికి హాజరు కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కెసిఆర్ పథకాలకు కాంగ్రెస్ లో కొంతమంది మద్దతు పలుకుతున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లడం వంటి వ్యవహారాలు రేవంత్ రెడ్డికి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి.బిజెపి కాంగ్రెసును ఈ విధంగా ఇరుకున పెట్టడం కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి.
.