తలలు, కాళ్లు, చేతులు, శరీరం అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలను శస్త్రచికిత్స ద్వారా వేరుచేసే అవకాశం ఆధునిక వైద్య శాస్త్రానికి వుంది.అయితే, ఇవి అన్నిసార్లు విజయవంతం అవుతాయని గ్యారెంటీ లేదు.
ఈ భయంతోనే మన తెలుగు నాట ఫేమస్ అయిన అవిభక్త కవలలు వీణా-వాణీలకు వారి తల్లిదండ్రులు సర్జరీ నిర్వహించడానికి వెనుకాడుతున్నారు.ఆపరేషన్ చేస్తే ఇద్దరిలో ఒకరే బ్రతికే చాన్స్ ఉందని, అదే సమయంలో ఇది సక్సెస్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదని చెప్పటంతో సర్జరీ ఆలోచన విరమించుకున్నారు.
అవిభక్త కవలలుగా వీరు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు .వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.మరొకరిది పైకి చూస్తుంది.అలాంటి తలలు అతుక్కుని పుట్టిన కవలలకు ఇజ్రాయిల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు.దీనిలో మన భారత సంతతికి చెందిన వైద్యుడు కూడా ఒక చేయి వేశాడు.
ఆయన పేరు నూర్ ఉల్ ఓవాసే జిలానీ.జమ్ముకశ్మీర్లో జన్మించిన జిలానీ, లండన్లోని గ్రేట్ ఓర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్నారు.అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉన్న జిలానీ సాయాన్ని ఇజ్రాయెల్లోని సోరోకా ఆసుపత్రి వైద్యులు కోరారు.
జిలానీ ఆరు నెలల పాటు ఇజ్రాయెల్ వైద్య బృందంతో మాట్లాడుతూ వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు.జిలానీ, ఆయన సహోద్యోగి, ప్రొఫెసర్ డేవిడ్ డన్వే ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కేసులలో నిష్ణాతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పాకిస్తాన్లోని పెషావర్కు సమీపంలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళకు ప్రసవానికి మూడు నెలల ముందుగానే సఫా, మర్వా అనే కవలలు జన్మించారు.అయితే వారిద్దరి తలలు అతుక్కుని పుట్టడంతో తమ బిడ్డలను కాపాడాల్సిందిగా వారు ఆయనను వేడుకున్నారు.
అలా 2017లో తొలిసారి ఈ తరహా ఆపరేషన్ను మొదటిసారి చేశారు జిలానీ.ఈ ఆపరేషన్కు కావాల్సిన డబ్బును ముర్తాజా లఖానీ అనే పాకిస్తానీ చమురు వ్యాపారి చెల్లించారు.
వందల గంటల ప్రాక్టీస్ తర్వాత జిలానీ ఈ కవలలకు విజయవంతంగా సర్జరీ చేశారు.
బ్రిటన్ వెలుపల కవలలకు శస్త్రచికిత్స చేయడానికి జిలానీ అంగీకరించడం ఇదే మొదటిసారి.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.ఒక యూదు కుటుంబానికి సహాయం చేయడానికి కశ్మీర్లో జన్మించిన ముస్లిం వైద్యుడు ఇజ్రాయెల్ బృందంతో కలిసి కవల తలలు విడదీసే సర్జరీకి సహకరించడం వైద్యం యొక్క సార్వత్రిక స్వభావాన్ని గుర్తు చేస్తుంది అని జిలానీ అన్నారు.
రంగు, మతం వంటి వ్యత్యాసాలు మానవులు సృష్టించుకున్నవేనని.పిల్లలు పిల్లలే, డాక్టర్ కోణం నుంచి మనమంతా ఒక్కటే అని ఆయన వ్యాఖ్యానించారు.ఆపరేషన్ తర్వాత పిల్లల తల్లి భావోద్వేగాన్ని అదుపు చేయడం తమకు కష్టంగా అనిపించిందని జిలానీ చెప్పారు.