తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి తెలంగాణలో తన హవా కొనసాగే విధంగా చేసుకుంటున్నారు.పార్టీలోనూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు.వరుసగా అనేక ప్రజా ఉద్యమాలు చేపడుతూనే టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు.
మరోవైపు పార్టీలో తనపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగిస్తూనే పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ, తన ప్రభావం కి తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక వరుసగా భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.సభలకు భారీ ఎత్తున జనాలు హాజరు అవుతుండడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.2023 ఎన్నికల్లో ఈ పరిణామాలు విజయానికి కారణం అవుతాయి అని రేవంత్ నమ్ముతున్నారు.
తెలంగాణ లో రాజకీయంగా వాస్తవ పరిస్థితి ఏమిటి ? అని అనేక అంశాలను తెలుసుకునేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే తెలంగాణలో రహస్యంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం.
తాను కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణలో ప్రభావం ఏవిధంగా ఉంది ? కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చిందా లేదా ? ప్రజల్లో తన నాయకత్వం పై ఎటువంటి అభిప్రాయం ఉంది ఇలా అనేక అంశాలపై సర్వే చేస్తున్నట్లు సమాచారం.
ఈ సర్వేను కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీల ద్వారా సర్వే చేయిస్తూ, ఈ సర్వే వివరాలు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.ఈ సర్వే రిజల్ట్ ఆధారంగా తన పని తీరును మార్చుకుని సరికొత్త విధంగా పోరాట మార్గాన్ని ఎంచుకునేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారట.ఇప్పటికే తన పని తీరుపై కాంగ్రెస్ అధిష్టానం పూర్తి సంతృప్తితో ఉండడంతో , రాష్ట్రంలోనూ తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఈ సర్వేకు రేవంత్ దిగినట్టుగా కనిపిస్తున్నారు.