ఏపీ సీఎం జగన్ వ్యవహారం ఒక పట్టాన ఎవరికీ అర్థం కాదు.ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు సైతం జగన్ ఆలోచనలను ముందుగా అంచనా వేయలేరు.
పార్టీకి, ప్రభుత్వానికి కలిసి వచ్చే విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ , సరికొత్త విధంగా ముందుకు వెళ్లడం జగన్ స్టైల్.ఇప్పుడు జగన్ తన మంత్రి మండలి ప్రక్షాళన విషయంలోనూ ఎవరి ఆలోచనకు అంతుపట్టని విధంగా తను మంత్రిమండలిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో దాదాపు 90 శాతం మందిని తప్పించబోతున్నారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.అయితే కొత్తగా ఎవర్ని మంత్రులుగా తీసుకోబోతున్నారు అనే విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతూ జగన్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి జగన్ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది సంచలనంగా మారింది.పార్టీ వ్యవహారమైనా , ప్రభుత్వం వ్యవహారం అయినా, జగన్ మనసులో ఉన్న మాటను ఉన్నది ఉన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతుంటారు.
అయితే ఆయన ప్రభుత్వ సలహాదారుగా కీలకమైన స్థానంలో ఉండడంతో పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటూ అదేపనిగా టిడిపి విమర్శలు చేస్తోంది.అయితే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మిగిలిన వారిని జగన్ పెద్దగా నమ్మే పరిస్థితి లేదు వైసీపీ అధికారంలోకి రాకముందు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ స్థాయిలో జగన్ ప్రాధాన్యత ఇచ్చారో, అంతే స్థాయిలో ఇప్పుడు ఇస్తున్నారు.
కాకపోతే అప్పుడు సజ్జల జగన్ వెనుక ఉండి అన్ని వ్యవహారాలను చక్కబెట్టే వారు.వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడంతో యాక్టివ్ గా మీడియా ముందుకు వస్తున్నారు.కొత్త మంత్రివర్గంలో ఆయనను మంత్రిగా కీలకమైన స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా ప్రతిపక్షాలు చేసే విమర్శలకు చెక్ పెట్టినట్లు అవుతుందనేది జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది.ఈయనే కాకుండా కొత్త మంత్రివర్గంలో ఎవరూ ఊహించని వ్యక్తులకు జగన్ మంత్రి పదవులు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారట.