మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ప్రాంతంలోనూ ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు మనకు దర్శనమిస్తున్నాయి.ముఖ్యంగా మనం ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ పరమేశ్వరుడి ఆలయాలు దర్శనమిస్తుంటాయి.
త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడిని వివిధ రకాల పేర్లతో భక్తులు పూజిస్తారు.ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి ప్రాంతంలోని శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఉంది.
ఈ ఆలయాన్ని పంచారామ క్షేత్రంగా పిలుస్తారు.ఈ ఆలయానికి ఎంతో విశిష్టత కలిగి ఉందని చెప్పవచ్చు.
ఈ ఆలయంలోని స్వామి వారు చంద్రుడిని అనుసరించి రంగులు మారుతూ భక్తులకు దర్శనం కల్పించడం ఈ ఆలయంలోని స్వామి వారి ప్రత్యేకత.ఈ విధంగా స్వామి వారు రంగులు మారుతూ భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చంద్రుడు శాపం కారణంగా తనకు శాపవిమోచనం కలగాలని ఇక్కడ స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠించాడని ఆలయ పురాణం చెబుతోంది.సాక్షాత్తు ఆ చంద్రుడు ఈ శివలింగాన్ని స్థాపించడం వల్ల చంద్రుడు మాదిరిగానే శివలింగం కూడా రంగులు మారుతూ భక్తులకు దర్శనమిస్తుంది.
పౌర్ణమి రోజు శివలింగం తెలుపు రంగులో భక్తులకు దర్శనమివ్వడం అమావాస్య రోజు గోధుమ రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తారు.ఈ అద్భుతమైన సంఘటనను చూడటానికి భక్తులు ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో పెద్దఎత్తున ఆలయానికి చేరుకుంటారు.
సాక్షాత్తు చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని సోమేశ్వరుడు అని కూడా పిలుస్తారు.అలాగే ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా ఐదు నందులు దర్శనమిస్తాయి.అందుకే ఈ ఆలయాన్ని పంచ నందీశ్వరాలయం అని కూడా పిలుస్తారు.ఈ ఆలయంలో ఉన్నటువంటి చంద్ర పుష్కరిణిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ ఆలయం పై అంతస్తులో అన్నపూర్ణాదేవి ఉండటం వల్ల ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులు ఎంతో ఉత్సవంగా జరుపుతారు.అలాగే మహాశివరాత్రి సందర్భంగా 5 రోజులపాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు.
ఈ ఉత్సవాలలో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు.