నేటికాలంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.తమ శక్తి సామర్ధ్యాలు, మేధా సంపత్తితో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న మహిళలు ఎందరో వున్నారు.
మహిళలు పూనుకుంటే సాధించలేనిది ఏం లేదని ఎన్నోసార్లు నిరూపించారు.ప్రపంచంలోని దిగ్గజ సంస్థల్లోని అత్యున్నత పదవుల్లో మహిళలు వున్నారు.
కాగా అమెరికాలో భారత సంతతి వైద్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అమెరికాతో పాటు భారత్లో ప్రజలకు నేనున్నానంటూ చేయూతనందించింది.
భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో భారీ విరాళాలు సేకరించి మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను ఇండియాకు పంపారు ఈ సంస్థ నిర్వాహకులు.అలాగే టెలి మెడిసిన్ సేవల ద్వారా కరోనా రోగులకు వైద్య సాయాన్ని అందించి వారిలో ధైర్యాన్ని నింపింది.
ఈ సంస్థ కార్యానిర్వాహక బాధ్యతలు చూస్తోంది మహిళలే కావడం విశేషం.వీరిలో అనుపమ గొట్టిముక్కల, కుసుమ్ పంజాబీ, ఆయేషా సింగ్, అంజనా సమద్దర్, సౌమ్య నెరవేట్ల ముందు వరుసలో వున్నారు.
గత నెలలో టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియాకు చెందిన పీడియాట్రిక్, అనస్థీయాలజిస్ట్ డాక్టర్ అనుపమ గొట్టిముక్కల ఏఏపీఐ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.తద్వారా 40 ఏళ్ల ఈ సంస్థ చరిత్రలో నాలుగవ మహిళా అధ్యక్షురాలిగా అనుపమ చరిత్ర సృష్టించారు.
అనుపమకు తోడుగా డాక్టర్ కుసుమ్ పంజాబీ ఏఏపీఐ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఛైర్గా, డాక్టర్ సౌమ్య నెరవేట్ల యంగ్ ఫిజిషియన్స్ సెక్షన్ (వైపీఎస్) అధ్యక్షురాలిగా, డాక్టర్ ఆయేషా సింగ్ మెడికల్ స్టూడెంట్/ రెసిడెంట్స్ అండ్ ఫెలోస్ విభాగం (ఎంఎస్ఆర్ఎఫ్) అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.ఇక ఏఏపీఐ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న డాక్టర్ అంజనా సమద్దర్ 2023-24లో అధ్యక్షురాలిగా సేవలందించే అవకాశం వుంది.
కాగా, అమెరికాలోని అతిపెద్ద ప్రవాస సంస్థ అయిన ఏఏపీఐలో దాదాపు 1,00,000 మందికి వైద్యులు సభ్యులుగా వున్నారు.యూఎస్లో ప్రతి ఏడుగురు రోగులలో ఒకరికి ఈ సంస్థలోని సభ్యులు వైద్యం అందిస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
తాజాగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఏఏపీఐ పలు సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.దీనిలో భాగంగా మెగా రక్తదాన శిబిరానికి శ్రీకారం చుట్టింది.
ఆగస్టు 15 నుంచి అమెరికాలోని 75 నగరాల్లో నెల రోజుల పాటు స్టెమ్ సెల్ డ్రైవ్తో పాటు రక్తదాన కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపింది.ఈ మేరకు ఏఏపీఐ అధ్యక్షురాలు అనుపమ గొట్టిముక్కల ప్రకటించారు.