తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
దళిత, గిరిజన, ఆదివాసీలను ఏకం చేసి వారి పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలిపేందుకుగాను ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
తాజాగా రేవంత్ సమక్షంలో ఆదివాసీ నేత వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ క్రమంలోనే పార్టీలోని కోవర్టులపైన చర్యలు తీసుకునేందుకు రేవంత్ వెనుకడుగు వేయడం లేదు.
తనతో సహా పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ పని చేసినా చర్యలు తప్పకుండా ఉంటాయని పేర్కొన్నారు రేవంత్.ఈ క్రమంలోనే పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో ఇటీవల కాలంలో రేవంత్ చర్చలు జరిపినట్లు వార్తలొస్తున్నాయి.
పార్టీకి వ్యతిరేకంగా పని చేయొద్దని వారికి సూచించినట్లు సమాచారం.కాగా, పార్టీలో ఉంటూనే వ్యతిరేక వ్యూహాలు రచిస్తున్న వారు ఇక పార్టీలో ఉండబోరనే సంకేతాలను రేవంత్ ఇప్పటికే పలువురికి పంపినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ నేతలను బుజ్జగింపు పర్వాలు కూడా మొత్తంగా ముగిసిపోయినట్లు తెలుస్తోంది.ఇక ఉన్న నేతలు, కార్యకర్తలతోనే సమిష్టిగా రేవంత్ పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
ఈ నెల 9న దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని లక్షమందితో నిర్వహించబోతున్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు, ర్యాలీలు, సమావేశాలు కూడా ఉండబోతున్నాయి.మొత్తంగా గ్రూపుల కుంపటిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఐక్యత తెచ్చేందుకుగాను తన వంతు ప్రయత్నం రేవంత్ చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అనుసరించే వ్యూహంపై సమీక్ష చేస్తూనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకు రేవంత్రెడ్డి ప్రణాళికలు రచించుకుంటున్నారు.
అన్ని వర్గాల్లోకి కాంగ్రెస్ పార్టీని మళ్లీ తీసుకెళ్లడంతో పాటు వారి పక్షాన నిలిచి నికరంగా పోరాడేందుకు రేవంత్ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.