ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలను టిఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ రావు తో పాటు , కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు బాధ్యతలు అప్పగించింది టిఆర్ఎస్ అధిష్టానం.దీంతో కమలాకర్ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి , ఆ నియోజకవర్గం నుంచి అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
పెద్ద ఎత్తున నాయకులు టిఆర్ఎస్ లోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ, తనకు ఉన్న పరిచయాల ద్వారా రాజేందర్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో బిజెపి గంగుల కమలాకర్ వ్యాపార వ్యవహారాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే గంగుల కమలాకర్ కు చెందిన గ్రానైట్ వ్యాపారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి సారించారు.
చాలా కాలంగా గ్రానైట్ బిజినెస్ లో ఉన్న గంగుల కమలాకర్ కు శ్వేత ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఉంది.
దీంతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.అయితే భారీ ఎత్తున గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేస్తూ, సరైన లెక్కలు చెప్పడం లేదంటూ ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో, ఆ ఫిర్యాదు ఆధారంగా పెమా చట్టం కింద విచారణ మొదలుపెట్టింది.
దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ వ్యాపారం నడుస్తోంది. శ్వేతా ఏజెన్సీస్, శ్వేతా గ్రానైట్స్ తో పాటు ఎన్నో కంపెనీలు ఈ గ్రానైట్ వ్యాపారంలో ఉన్నాయి.అయితే వీటిలో చాలా వరకు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, పన్నులు చెల్లించడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి.దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయని నిర్ధారించాయి.2013లోనే ఈ కంపెనీలకు దాదాపు 750 కోట్ల వరకు జరిమానాను విధించారు.
అయితే ఈ జరిమానాలు కేవలం 11 కోట్లు మాత్రమే చెల్లించడంతో దీనిపైన ఈడీకి ఇప్పుడు ఫిర్యాదులు అందాయి.గంగుల కమలాకర్ వ్యాపార వ్యవహారాలను దెబ్బ కొట్టడం ద్వారా హుజురాబాద్ లో ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుందనేది బిజెపి ఎత్తుగడగా కనిపిస్తోంది.కరీంనగర్ జిల్లాలో గనుల శాఖ ఇచ్చిన అనుమతులకు మించి గ్రానైట్ విదేశాలకు తరలించారని , ప్రభుత్వానికి 129.94 కోట్ల టాక్స్ ను ఎగ్గొట్టరు అంటూ.9 గ్రానైట్ కంపెనీలకు బుధవారం నోటీసులు అందాయి.ఈ సొమ్ము కు ఐదు రెట్లు కలిపి మొత్తం 749.66 కోట్లు పెనాల్టీ విధించారు.ఇందులో కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్ కంపెనీకి 360 కోట్లు పెనాల్టీ గా విధించడం కలకలం రేపుతోంది.