ఓ వ్యక్తి ఆషామాషీగా గొప్పవాడు కాడు.ఆ ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు, అవమానాలు, అపజయాలు.
కానీ ఓటమికి కృంగిపోక, పడిలేచిన కెరటంలా ముందుకు సాగేవాడే విజయం సాధిస్తాడు.ఏ రంగంలోనైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఇప్పుడు ప్రపంచంలో వున్న గొప్ప కుబేరులంతా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే.వారు ఆ స్థాయికి చేరుకోవడానికి ఆహోరాత్రులు శ్రమించారు.
ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడంతో పాటు భవిష్యత్ను అంచనా వేస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పదిలంగా వుంచుకుంటున్నారు.ఇలాంటి పారిశ్రామికవేత్తల్లో ఒకరు టెస్లా అధినేత ఎలన్ మస్క్.
ఆయన ఏదైనా పని చేపట్టారంటే.అది సక్సెస్ అయ్యి తీరాల్సిందే.
మస్క్పై వ్యాపార వర్గాలు, వాటాదారులు, ప్రజల పెట్టుకున్న నమ్మకం అలాంటిది మరి.ఈ స్థాయికి చేరడానికి ఎలన్ మస్క్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.ఓ దశలో తన కలల ప్రాజెక్ట్గా చెప్పుకుంటున్న స్పేస్ ఎక్స్ను దాదాపుగా మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చాయట.ఈ విషయాన్ని స్వయంగా ఎలన్ మస్కే తెలియజేశారు.ఓ ఇంటర్వ్యూలో ఆనాటి పరిస్ధితులను గుర్తు చేసుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియోను ‘టెస్లా ఓనర్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ’ గ్రూప్ ట్విటర్లో షేర్ చేయగా.
ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిందంటే.
స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన ఫాల్కన్ వ్యోమనౌక నిర్దేశిత కక్ష్యను చేరుకోవడంలో తొలుత మూడుసార్లు విఫలమైన సంగతి తెలిసిందే.దీంతో ప్రత్యర్థులు, వ్యాపార వర్గాలు, మీడియా ఎలన్ మస్క్పై విమర్శలు గుప్పించాయి.
కానీ ఆయన మొక్కవోనీ ధైర్యంతో నాలుగో ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగాన్ని పూర్తి చేశారు.అయితే, అప్పటికే స్పేస్ ఎక్స్ తీవ్ర నష్టాల్లోకి జారుకుంది.
దాదాపు మూసివేసే స్థితికి చేరుకుంది.సరిగ్గా అదే సమయంలో నాసా నుంచి మస్క్కు ఓ శుభవార్త అందింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి సామగ్రిని తీసుకెళ్లాల్సిన భారీ కాంట్రాక్టును స్పేస్ ఎక్స్కు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.ఈ డీల్ విలువ 1.6 బిలియన్ డాలర్లు.అప్పటికే తీవ్ర నిరాశలో కూరుకుపోయిన మస్క్కు ఈ వార్త పెద్ద ఊరట కలిగించింది.ఈ వార్తను ఫోన్ ద్వారా తెలుసుకున్న ఆయన వెంటనే ‘ఐ లయ్ యూ గాయ్స్’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.2008 క్రిస్మస్కు రెండు రోజుల ముందు జరిగిన ఘటనను గుర్తుచేసుకుని ఎలన్ మస్క్ కంటతడి పెట్టారు.ఒక రకంగా నాసా తనను, స్పేస్ ఎక్స్ను కాపాడిందని మస్క్ వ్యాఖ్యానించారు.
ఫాల్కన్ విజయవంతమైన తర్వాత.డ్రాగన్, క్రూడ్రాగన్ పేరిట స్పేస్ ఎక్స్ వ్యోమనౌకల్ని నిర్మించింది.క్రూ డ్రాగన్ ఇప్పటి వరకు రెండుసార్లు వ్యోమగాముల్ని విజయవంతంగా ఐఎస్ఎస్కు తీసుకెళ్లింది.
మరోవైపు 2024లో చంద్రుడిపైకి చేపట్టనున్న మానవసహిత యాత్రకు అవసరమైన కీలక ‘హ్యూమన్ ల్యాండర్ సిస్టం’ నిర్మాణానికి స్పేస్ ఎక్స్తో నాసా ఒప్పందం కుదుర్చుకుంది.
కాగా, ఈ కాంట్రాక్ట్ విషయమై నాసాకు అమెజాన్ అధినేత బెజోస్ బంపరాఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆర్టిమస్ ఆస్ట్రోనాట్లు ప్రయాణించే వ్యోమనౌక (స్పేస్ క్రాఫ్ట్) తయారీ బాధ్యతలను తమకిస్తే 200 కోట్ల డాలర్ల ( భారత కరెన్సీలో రూ.14,898 కోట్లు ) డిస్కౌంట్ ఇస్తానని బెజోస్ ప్రకటించారు.స్పేస్ ఎక్స్ కు ఆర్బిటాల్ ప్రయోగాల్లో ఉన్న అపార అనుభవం, సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని ఎలన్ మస్క్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు నాసా సీనియర్ అధికారి కేథీ ల్యూడర్స్ చెప్పారు.