కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోయిన సంగతి తెలిసిందే.ఇప్పుడిప్పుడే ఇండియాలో పరిస్ధితులు కుదటపడుతున్నాయి.
రెండు నెలల క్రితం భారత్లో పరిస్ధితి చూసి ప్రపంచం నివ్వెరపోయింది.చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోయారు.
ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకున్నాయి.పీకల్లోతు కష్టాల్లో వున్న భారత్ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది.
వివిధ దేశాలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వైద్య సామాగ్రి, మందులు ఇండియాకు పంపాయి.అటు పుట్టెడు కష్టంలో వున్న జన్మభూమికి ఎన్ఆర్ఐలు సైతం బాసటగా నిలిచారు.
పలుదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయ సంఘాలు భారీగా విరాళాలను సేకరించి ఇండియాకు అవసరమైన వైద్య సామాగ్రి సహా నిధులను అందజేస్తున్నారు.ఈ సాయం ఇంకా కొనసాగుతుండటం విశేషం.
కాగా, అమెరికాలో భారత సంతతి వైద్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అమెరికాతో పాటు భారత్లో ప్రజలకు నేనున్నానంటూ చేయూతనందించింది.
భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో భారీ విరాళాలు సేకరించి మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను ఇండియాకు పంపారు ఈ సంస్థ నిర్వాహకులు.అలాగే టెలి మెడిసిన్ సేవల ద్వారా కరోనా రోగులకు వైద్య సాయాన్ని అందించి వారిలో ధైర్యాన్ని నింపింది.
భారత్ కుదుటపడిందని విశ్రాంతి తీసుకోకుండా ఈ సంస్థ ప్రతినిధులు సాయాన్ని కొనసాగిస్తూనే వున్నారు.తాజాగా మరో 5 లక్షల డాలర్ల విరాళాలను సేకరించి ఈ నిధుల సాయంతో 2,300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 100 వెంటిలేటర్లు, 100 హై ఫ్లో నాజల్ కాన్యూలా మిషన్లను కొనుగోలు చేసి భారత్లోని 45 ఆసుపత్రులకు పంపారు.ఆగస్టు చివరి నాటికి భారత్లో థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం వుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో మారుమూల ప్రాంతాలను ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఏఏపీఐ వెల్లడించింది.