కోవిడ్ సెకండ్ వేవ్తో భారతదేశం అతలాకుతలమైన సంగతి తెలిసిందే.తొలి దశలో ఇంటి నుంచే కోలుకున్న జనం.
రెండో దశలో మాత్రం ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వచ్చింది.ఉత్పరివర్తనం చెంది మరింత శక్తిని పుంజుకున్న వైరస్.
శ్వాస వ్యవస్థపై నేరుగా దాడి చేయడంతో చాలా మందిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి.అందుకే వెంటిలేటర్, ఆక్సిజన్ కోసం ఎగబడ్డారు.
కానీ పెరుగుతున్న కేసులతో ఆసుపత్రుల్లో బెడ్లు, ప్రాణవాయువు కొరత వేధించింది.వైద్యులు రోగులను బ్రతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ మరణాలను నియంత్రించలేకపోయారు.
ఇదే సమయంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కొరత కారణంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది.క్లిష్ట పరిస్థితుల్లో వున్న దేశాన్ని ఆదుకునేందుకు, అందరికీ వైద్యం అందించేందుకు గాను అమెరికాలోని ఎన్ఆర్ఐ వైద్యులు నడుంబిగించారు.
దీనిలో భాగంగా భారత్లో పెద్ద ఎత్తున వున్న రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ)లకు కోవిడ్ చికిత్సపై శిక్షణ ఇస్తున్నారు.ఎందుకంటే భారతదేశ వైద్య రంగంలో ఆర్ఎంపీలదే కీలక పాత్ర.
గ్రామ గ్రామాన విస్తరించిన వీరి వల్లే మెజారిటీ వైద్యం అందుతోంది.అందువల్ల వీరికి కోవిడ్ చికిత్సపై అవగాహన కల్పిస్తే.
పట్టణాలు, నగరాల్లోని ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది.ఈ ఆలోచనతోనే ఎన్ఆర్ఐ వైద్యులు ముందడుగు వేశారు.
అదే ‘‘ప్రాజెక్ట్ మదద్’’.
గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఆర్ఎంపీలకు, హెల్త్కేర్ వర్కర్లకు సరైన శిక్షణ ఇవ్వడమే ప్రాజెక్టు మదద్ ఉద్దేశం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని పలు గ్రామాల్లో ఇప్పటికే 150 మందికిపైగా ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, యువతకు కూడా విపత్కర పరిస్ధితుల్లో ఎలా స్పందించాలో మెళకువలు నేర్పారు.
వీరి కృషితో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట కొవిడ్ రహిత గ్రామంగా నిలిచింది.వైద్యారోగ్యశాఖతో కలిసి తాము చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయని ‘ప్రాజెక్ట్ మదద్’ స్వచ్ఛంద సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.2,253 మంది జనాభా గల రాజన్నపేటను నూటికి నూరు శాతం ‘కొవిడ్ రహిత- కొవిడ్ను తట్టుకోగల’ గ్రామంగా మార్చామని నిర్వాహకులు వెల్లడించారు.వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడంతోపాటు కరోనా కట్టడి చర్యలను పకడ్బందీగా చేపట్టడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.కరోనా పట్ల ఉన్న అపోహలను తొలగించడం, వ్యాక్సిన్ పట్ల సందేహాలను నివృత్తి చేయడం వంటి చర్యలతో చికిత్స, వైద్య సదుపాయాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేసినట్టు తెలిపింది.
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించింది.