అయిపోయిన పెళ్ళికి వాయిద్యాలు ఎందుకు అన్నట్లుగా గత టిడిపి ప్రభుత్వంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుకి ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహనికి గురవుతున్నారు.ఇంతకీ విషయం ఏమిటంటే , ప్రస్తుతం వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు.
సామాజిక వర్గాల ఆధారంగా పార్టీ కోసం కష్ట పడిన వారిని గుర్తించి వారికి పదవులు కట్టబెడుతున్నారు.అలాగే 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులకు, మొదటి నుంచి పార్టీకోసం కష్ట పడిన వారికి ప్రాధాన్యం దక్కేలా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ కార్యకర్తల్లో నాయకుల్లో ఆనందం నింపుతున్నారు. దీంతో మొన్నటి వరకు కాస్తోకూస్తో అసంతృప్తితో ఉన్న నాయకుల్లో ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తోంది.ఈ అంశంపైనే టిడిపి నాయకులు తీవ్ర స్థాయిలో తమ అధినేత తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
టిడిపి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే విషయంపై దృష్టి పెట్టలేదని, పార్టీ నాయకుల నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా , ఆయన మాత్రం సైలెంట్ గానే ఉందిపోయారని, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే పార్టీలో తీవ్ర అసంతృప్తులు పెరుగుతాయని , పదవులు దక్కని వారు పార్టీకి కీడు చేస్తారు అని చంద్రబాబు వెనక్కి తగ్గిపోయారు.అయితే ఇప్పుడు జగన్ మాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సరికొత్త విధంగా శ్రీకారం చుట్టారు.
ఎవరికి అసంతృప్తి కలగకుండా , పార్టీ కోసం కష్టపడ్డారు అని పేరు ఉన్నవారికి పదవులను కట్టబెడుతూ ముందుకు వెళ్తున్న తీరును గుర్తుచేసుకుంటూ టిడిపి నాయకులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.అసలు రాష్ట్రంలో ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయనే విషయం తమకు తెలియదని , జగన్ మాత్రం తమ పార్టీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని, టిడిపి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూసి చూసి విసుగు చెందామని, పదవుల కోసం అప్పట్లో ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు జగన్ తీరు తలుచుకుంటూ తమ అధినేత పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏపీ లో కనిపిస్తున్నాయి.ఎప్పుడో జరిగిపోయిన వ్యవహారమే అయినా ఇప్పుడు మాత్రం చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశంగా మారిపోయింది.