ఎన్నికల వచ్చినప్పుడే చిన్నాచితకా నాయకులకు కూడా మంచి ప్రాధాన్యం దక్కుతుంది.ఇక ప్రజల సంగతి అయితే చెప్పనవసరం లేదు.
అధికార పార్టీ అయితే ఎన్నికల ముందు ఎన్నో కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి, జనాలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తాయిలాలు అందిస్తూ, తాము ఎప్పుడూ ఇదే విధంగా జనాలకు మేలు చేస్తామని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాయి.అధికారంలో లేని పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాము అనే ఈ విషయాన్ని కాస్త గట్టిగానే చెబుతూ ఉంటాయి.
ప్రస్తుతం హుజురాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికల వ్యవహారం తీసుకుంటే ఇక్కడ గెలుపు కోసం టిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
ముఖ్యంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ ను ఓడించేందుకు టిఆర్ఎస్ కొత్తగా ప్రవేశపెడుతున్నా, ఆ పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తునే ఉన్నాయి.ఓటమి భయంతోనే కెసిఆర్ ఇంతగా కంగారు పడుతున్నారనే అభిప్రాయం కలుగుతోంది.ఇదిలా ఉంటే హుజురాబాద్ లో కీలక నేతగా కాంగ్రెస్ లో ఉంటూ వచ్చిన కౌశిక్ రెడ్డి ఇటీవల టిఆర్ఎస్ లో చేరిపోవడం, ఆయనకు ఆ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండడంతో అన్ని రకాలుగానూ ఆలోచించి నిన్న జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవిని నామినేటెడ్ కోటాలో ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
పార్టీలో చేరి పది రోజులు అయ్యిందో లేదో అప్పుడే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఈ ఆశ్చర్యం లో అందరు ఉండగానే ఆయనకు ఎమ్మెల్సీ తో పాటు , మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట.
అలా చేస్తేనే ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థికి విజయం దక్కించుకునే విధంగా పరిస్థితులు మారుతాయని, కౌశిక్ రెడ్డి కూడా మంత్రి హోదాలో నియోజకవర్గంలో పర్యటిస్తూ , ఈ నియోజకవర్గాన్ని తాను ఏ విధంగా అభివృద్ధి చేస్తాను అనేది చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని, దీని ద్వారా ఈటెల రాజేందర్ ప్రభావం పూర్తిగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ పదవి కంటే మంత్రి పదవి అంటే పలుకుబడి ఎక్కువ ఉంటుందని అధికారులు ఆయన మాట పూర్తిగా వింటారని, దీని ద్వారా పరిస్థితులు తమకు అనుకూలంగా మారతాయి అనే అంచనాతోనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని తాజాగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అది కాకుండా తమకు రేవంత్ రెడ్డి నుంచి ముప్పు ఉండటంతోనే కౌశిక్ రెడ్డి కి ప్రాధాన్యం పెంచాలని కెసిఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కౌశిక్ వ్యవహారం టిఆర్ఎస్ లో సంచలనం రేపుతోంది.కేవలం హుజురాబాద్ ఎన్ని కలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఎమ్మెల్సీ , మంత్రి పదవి దక్కుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.