హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహణ కుదరదని, కరోనా వైరస్ పరిస్థితుల రిత్యా పోస్ట్ పోన్ చేయాల్సిందిగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి అందరికీ విదితమే.దాంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండబోవనే చర్చ జరిగింది.
ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా పోస్ట్ పోన్ అవుతుందనుకున్నారు.కానీ, బై ఎలక్షన్ కంపల్సరీ కండక్ట్ చేయబోతున్నట్లు సంకేతాలు అందినట్లు వార్తలు రాగా, సీఎం కేసీఆర్ తాజాగా తన ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికను మనసులో పెట్టుకునే ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కన్ఫర్మేషన్ ఇచ్చారు పింక్ పార్టీ బాస్.
అయితే, ఇప్పటికే పలు సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిన సీఎం తన మాట నిలబెట్టుకుంటాడో? లేదో? కాలమే నిర్ణయిస్తుంది.హుజురాబాద్ ఉప ఎన్నికపైన ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు గాను ఆ ప్రాంతానికి చెందిన కీలక నేతలకు పదవులు కట్టబెట్టుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఈటల అనుచరుడు బండ శ్రీనివాస్కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన కేసీఆర్, ఆ ప్రాంతం నుంచి ఇటీవల గులాబీ గూటికి వచ్చిన ఎల్.రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి, స్వర్గం రవి పేర్లను ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందకు పరిశీలిస్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది.
ఆల్రెడీ కుమ్మరి, రజక, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలి నేతలకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్.ఈ క్రమంలోనే బీసీ ఉప కులాలకు ప్రాధాన్యతనివ్వడం కూడా ముఖ్యమేనని గులాబీ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఎస్సీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా ముఖ్యమేనని పలువురు పేర్కొంటున్నారు.అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కరోనా వైరస్ను బూచిగా చూపెట్టడం అసలు కారణం కాదని, అసలు కారణం హుజురాబాద్ ఉప ఎన్నికనేనని టీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.