వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీపైన ముఖ్యమంత్రి, ఆయన తనయుడిపైన షర్మిల తరచూ విమర్శలు చేస్తోంది.
అయితే, తెలంగాణ రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం పట్ల మొదటి నుంచి పలు అనుమానాలున్నాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లపై షర్మిలకు అవగాహన ఉందా? అనే ప్రశ్న మీడియాతో పాటు ప్రజానీకం నుంచి రాగా, తనకు తెలంగాణ గురించి సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొంది.తను తెలంగాణకు చెందిన వ్యక్తనే మ్యారేజ్ చేసుకున్నట్లు చెప్పింది.తాజాగా ఆమె తెలంగాణ సంస్కృతికి ప్రతీకయైన బోనాల్లో పార్టిసిపేట్ చేసింది.
తద్వారా తెలంగాణ ప్రజల గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది ఏపీ సీఎం జగన్ సోదరి.
షర్మిల బోనాల్లో వేడుకల్లో పాల్గొనేందుకు గాను తన చిన్ననాటి ఫ్రెండ్ రజని నివాసానికి వెళ్లింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం గ్రామానికి వెళ్లి స్నేహితురాలి కుటుంబీకులతో బోనమొత్తుకుని ఆడిపాడింది షర్మిల.స్నేహితుల దినోత్సవం, బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసిన అనంతరం షర్మిల తాను బోనమొత్తుకున్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
ఈ క్రమంలో తెలంగాణ సంస్కృతికి స్వచ్ఛమైన ప్రతి రూపమైన బోనాల పండుగలో భాగంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకుంటున్నారని, ఎత్తే బోనం ప్రజలకు సుఖ సంతోషాలివ్వాలని కోరుతూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టింది.
ఇక వైఎస్ఆర్టీపీ ప్రధాన కార్యాలయంలో మాత్రం సదరు పార్టీ మహిళా నేత ఇందిరా శోభన్ బోనం ఎత్తింది.మొత్తంగా బోనాల ఉత్సవాల్లో వైఎస్ఆర్టీపీ కూడా పార్టిసిపేషన్ ఉంది.తెలంగాణ బోనమెత్తి షర్మిల తన విమర్శకులకు తగిన రీతిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిందనే చెప్పొచ్చు.
తెలంగాణ రాష్ట్రసర్కారుపైనా, ముఖ్యమంత్రిపైనా, ముఖ్యమంత్రి కొడుకుపైనా వై.ఎస్.షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా కేసీఆర్ కానీ, ఆయన కుటుంబీకుల నుంచి స్పందించడం లేదు.నిరుద్యోగ దీక్ష పేరిట ఆమె చేస్తున్న దీక్ష పట్ల ప్రభుత్వం కనీసంగా స్పందించడం లేదు.