తెలంగాణలో ఫర్వాలేదు అన్నట్లుగా ఉన్నా, ఏపీలోనే పరిస్థితి దారుణంగా ఉందనేది బీజేపీ లెక్క.తమ పార్టీకి ఈ దుస్థితి రావడానికి కారణం తమ రాజకీయ ప్రత్యర్దులయిన టిడిపి, వైసిపిలు బలంగా ఉండడమే కారణం అని ఆ పార్టీ నమ్ముతోంది.
అందుకే ఏదో ఒక రకంగా తాము ఏపీలో బలమైన పార్టీగా ముద్ర వేయించుకోవాలని బిజెపి చాలాకాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉంది.బిజెపి కేవలం కొన్ని వర్గాలకు, పట్టణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోవడంతో టిడిపి, వైసిపి మాదిరిగా గ్రామస్థాయి నుంచి జనాలు, రైతులు ఇలా అన్ని వర్గాల్లోనూ తమకు ఆదరణ ఉండేలా చేసుకోవాలని చూస్తున్నారు.
ప్రస్తుతం వైసిపి పరిపాలన పై జనాల్లో సంతృప్తి ఉండడం, వైసిపి కాకపోతే టిడిపి అన్నట్లుగా జనాలు చూస్తుండటంతో, తాము ఈ రెండు పార్టీలకు తీసిపోము అన్నట్లుగా బీజేపీ ఇప్పుడు వ్యవహరిస్తోంది.
దీనిలో భాగంగానే జగన్ కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలోనే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది.
దీనిద్వారా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు , రైతు కూలీలు ఇలా అందరి మద్దతు తమకు ఉంటుందని బిజెపి నమ్ముతోంది.ప్రస్తుతం పోలవరం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేందుకు చూస్తుండడంతో, మిగతా ప్రాజెక్టుల అంశాన్ని లేవనెత్తి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
దీనిలో భాగంగానే ఏపీలో మొత్తం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్ తో కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకుందట.
ఈ పాదయాత్రకు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వం వహించబోతున్నట్టు సమాచారం.ఎప్పటి నుంచో రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ యాత్ర చేయాలని, ఆ ప్రాంతంలో జగన్ ప్రభావం పూర్తిగా తగ్గించాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.ఈ యాత్ర ద్వారానే జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనే ఆశతో బీజేపీ ఉంది.
త్వరలోనే బిజెపి నేతలు ఏపీలో పాదయాత్ర చేపట్టబోయే విషయమై స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.తాము లేవనెత్తబోయేది రైతుల అంశం కాబట్టి, తమకు అన్ని రకాలుగాను ఏపీలో కలిసి వస్తుందనేది బిజెపి ప్లాన్ గా అర్ధం అవుతోంది.