హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఇప్పటికే ఆ నియోజకవర్గానికి వరాల జల్లులు కురుస్తూనే ఉన్నారు.వీటితో పాటు ఈ నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెస్ లో ఉన్న నేతలు, ఈటెల రాజేందర్ ప్రధాన అనుచరులను టార్గెట్ చేసుకుని తమ పార్టీలో చేర్చుకునే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
ఇక దళిత బంధు వంటి భారీ బడ్జెట్ పథకాన్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.ఏం చేసినా, ఎన్ని చేసినా అంతిమంగా తమకు గెలుపు దక్కాలనే వ్యూహంతోనే కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థిగా మొదట్లో ప్రచారం జరిగిన పాడి కౌశిక్ రెడ్డి కి అక్కడ యువతలో మంచి పట్టు ఉండడం, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందడం, బలమైన అభ్యర్ధి కావడంతో త్రిముఖ పోటీ నెలకొంటుంది అని కేసీఆర్ టెన్షన్ పడ్డారు.
అయితే కాంగ్రెస్ లో చోటుచేసుకున్న పరిణామాలతో కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ లో చేరిపోయారు.
అయితే ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేస్తారని అందరూ భావించినా, కేసీఆర్ మాత్రం అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ గా నియమించాలని తాజాగా తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది.
గత నెల 21న టిఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి కి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఈ పదవి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
ఇవే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నాయకులకు, ఈటెల అనుచరులకు కీలకమైన పదవులు కట్టబెట్టి, ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పట్టు చేజారిపోకుండా కేసీఆర్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు .ఎమ్మెల్సీ పదవి తో పాటు, ఈ హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కౌశిక్ రెడ్డి గట్టిగానే కృషి చేయాలని, ఆ మేరకు పూర్తి బాధ్యత ఆయన తీసుకోవాలి అన్నట్లుగా కేసీఆర్ కౌశిక్ కు ఇప్పటికే చెప్పినట్లు సమాచారం.అదికాకుండా ఈటెల రాజేందర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాల పైన కౌశిక్ రెడ్డి కి అవగాహన ఉండటం, గతం నుంచి ఈటెల పై విమర్శలు చేస్తూ ఉండడం, ఇవన్నీ తమకు కలిసి వచ్చే అంశాలుగా కేసీఆర్ భావించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినట్టుగా కనిపిస్తున్నారు.