హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాల పండుగ సందర్భంగా భక్తుల కోలాహలంతో సందడి ఏర్పడింది.ఈ సందర్భంగా బీజేపీ మహిళా నేత విజయశాంతి లాల్ దర్వాజా సింహవాహినీ జగన్మాతకు బోనాలు సమర్పించారు.
తెలంగాణా వస్తే బంగారు బోనం సమర్పిస్తానని ఏడేళ్ల కిందట మొక్కుకున్న మొక్కు విజయశాంతి నేడు తీర్చారు.బంగారు కలశంతో బోనం తెచ్చి అమ్మవారికిసమర్పించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని అమ్మ వారిని ప్రార్ధించానని విజయశాంతి అన్నారు.బీజేపీ అధికారంలోకి వసే మరోసారి బంగారు బోనమెత్తుతానని అమ్మ వారికి మొక్కినట్టు ఆమె చెప్పారు.
సీఎం కే.సి.ఆర్ నియంతృత్వ పాలన లో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు బీజేపీ పాలన అవసరమని అన్నారు.కరోనా బారి నుండి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరినట్టు విజయశాంతి తెలిపారు.
అమ్మవారి శక్తిపై తనకు అపార నమ్మకం ఉందని ఆమె వెల్లడించారు.విజయశాంతితో పాటుగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఇతర నేతలు కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలతో పాటుగా మద్యం షాపులను కూడా బంద్ చేసిన విషయం తెలిసిందే.