అమెరికా సెనేట్ దేశం కోసం తన వీకెండ్ను త్యాగం చేసింది.రోడ్లు, రైల్వే లైనులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఉద్దేశించిన 1 ట్రిలియన్ డాలర్ల విలువైన బిల్లుపై చర్చ కోసం సెనేట్ శనివారం పనిచేసింది.
అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ఈ బిల్లుపై చర్చ కోసం డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఒకే మాటపై నిలబడటం విశేషం.ఇద్దరికి చెరిసగం బలం కలిగిన సెనేట్లో ఇప్పటికే విస్తృతమైన చర్చ ద్వారా రెండు అడ్డంకులను ఈ బిల్లు క్లియర్ చేసింది.
కానీ ఇప్పటి వరకు చట్టసభ సభ్యులు బిల్లు తుది ముసాయిదాను చూడలేదు.ఇందులో కొత్త ఖర్చు కింద 550 బిలియన్ డాలర్లను చేర్చారు.
ఈ సందర్భంగా డెమొక్రాటిక్ సెనేట్ నాయకుడు చక్ షుమెర్ మాట్లాడుతూ.ఈ చట్టంపై పనిచేయడానికి అదనపు సమయం అవసరమని పేర్కొన్నారు.సిబ్బంది ఇంకా పనిచేస్తున్నారని.సవరణలపై ఓటింగ్ జరిగే అవకాశం వుందని తెలిపారు. 1 ట్రిలియన్ డాలర్ల బిల్లుకు ఆమోదం పొందిన తర్వాత వాతావరణ మార్పు, వృద్ధులు, పిల్లల గృహ సంరక్షణకు ఉద్దేశించిన 3.5 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ముందుకు తీసుకెళ్లాలని షుమెర్ భావిస్తున్నారు.మరోవైపు బిల్లుపై చర్చను చేపట్టడానికి శుక్రవారం జరిగిన ఓటింగ్లో సెనేట్ 66-28 తేడాతో ఆమోదముద్ర వేసింది.16 మంది రిపబ్లికన్లు, 48 మంది డెమొక్రాట్లు, ఇద్దరు స్వతంత్రులు బిల్లుకు మద్ధతుగా నిలిచారు.
కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు రికార్డు స్థాయి అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి, చైనా నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో 6 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.నూతనంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధను పునర్నిర్మించడానికి ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అయితే 6 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్లో సింహభాగం దేనికి కేటాయించాలో డెమొక్రాట్లు స్పష్టం చేశారు.ఇందులో 2.3 ట్రిలియన్ డాలర్ల (ఇది కాంగ్రెస్లో జరిగిన చర్చల సందర్భంగా 1.7 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది) ను మౌలిక సదుపాయాల కోసం ఉద్దేశించిన బిల్లుకు కేటాయించనున్నారు.మరో 1.8 ట్రిలియన్ డాలర్లను ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్య, సామాజిక సేవలకు కేటాయిస్తారు.21వ శతాబ్దంలో మెరుగైన శ్రామిక శక్తిని నిర్మించడంలో భాగంగా వీటికి రూపకల్పన చేసినట్లు బైడెన్ వెల్లడించారు.