టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ అర్థమవుతున్నది.స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తుండటాన్ని మనం చూడొచ్చు.
ఈ క్రమంలోనే అధికార పార్టీ గెలుపునకు సీఎం ‘దళిత బంధు’ పథకం సాయపడుతుందని అంచనా వేస్తున్నారు.అయితే, ఒక రకంగా ఈ స్కీమ్ వల్ల అధికార పార్టీకి షాక్లు తగులుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు జనాలు సోషల్ మీడియా వేదికగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఒకవేళ రాజీనామా చేస్తే మళ్లీ మిమ్మల్నే గెలిపిస్తామని పేర్కొంటున్న సంగతి మనం గమనించొచ్చు.ఇక ఇదిలా ఉండగా కేవలం ‘దళిత బంధు’ మాత్రమే కాకుండా ‘బీసీ బంధు’ కూడా అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.
కృష్ణయ్య డిమాండ్ చేస్తున్న పరిస్థితులను గమనించొచ్చు.ఈ క్రమంలోనే అధికార పార్టీకి మరో షాక్ తగిలింది.
అది ఏంటంటే టీఆర్ఎస్ సర్కారు తీరును నిరసిస్తూ హుజురాబాద్ బై పోల్లో పోటీకి సిద్ధమవుతున్నారు మిడ్ మానేరు నిర్వాసితులు.తమ సమస్యలను ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదంటూ మిడ్ మానేరు నిర్వాసితులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ సిరిసిల్లా జిల్లా మిడ్ మానేరు ఐక్యవేదిక పోరుకు సిద్ధమవుతున్నది.పలు రకాల ఆందోళనలు చేసినా ప్రభుత్వం
స్పందించకపోవడంతోనే ఇలా హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో వారు నిలువాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇటీవల వేములవాడ నంది కమాన్ వద్ద నల్ల బ్యడ్జీలు, బెలూన్లతో ధర్నా చేపట్టారు.ఈ క్రమంలోనే తమ సమస్యలు పరిష్కారం కోసం వెయిట్ చేశారు.
కానీ, సర్కారు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము సర్వస్వం త్యాగం చేశామని నిర్వాసితులు చెప్తున్నారు.
పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్న సాక్షిగా సీఎం కేసీఆర్ మిడ్ మానేరు నిర్వాసితులకు ఐదు లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తామన్న హామీ ఇచ్చారని, కానీ, దానని మరిచిపోయారని గుర్తు చేశారు.ప్రభుత్వం తక్షణం స్పందించాలని, తమ సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కోరుతున్నారు.లేనిపక్షంలో అనగా ఇలానే సిచ్యువేషన్స్ కొనసాగితే హుజురాబాద్ బై ఎలక్షన్లో మిడ్ మానేరు నిర్వాసితుల ఐక్య వేదిక తరఫున 120 మంది బరిలో దిగుతామని చెప్తున్నారు.ఈ క్రమంలోనే పోటీ చేయడం ద్వారా టీఆర్ఎస్ను ఓడించాలని వారు ప్లాన్ చేస్తున్నారు.