తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా తనదైన శైలిలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు.ఆయన నాయకత్వంలోనే దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు.
దీంతో సంజయ్ గ్రాఫ్ మరింతగా పెరిగింది.ఇక ఆయన హవాకు అడ్డు అదుపు లేదని, ఆయన సారధ్యంలోనే తెలంగాణలో 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు.
అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తే బండి సంజయ్ దూకుడుకు బ్రేకులు పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.దీనికి కారణం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు క్యాబినెట్ మంత్రి అయ్యారు.
ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆయన చక్కబెడుతున్నారు.పార్టీ హైకమాండ్ కూడా కిషన్ రెడ్డి కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్య త అప్పగించడం, తదితర కారణాలతో కిషన్ రెడ్డి వైపు ఎక్కువగా బిజెపి నాయకులు మొగ్గు చూపుతుండటం సంజయ్ వర్గంలో ఆందోళన పెంచుతూనే ఉంది.
ఇదిలా ఉంటే ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.దీని కోసం అనేక కమిటీలను నియమించారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు.
అయితే పాదయాత్ర చేపట్టే తేదీల్లోనే పార్లమెంట్ సమావేశాలు ఉండడం, ఎంపీలు ఖచ్చితంగా హాజరు కావాలని బిజెపి విప్ జారీ చేయడం తదితర కారణాలతో పాదయాత్రపై సందేహాలు మొదలయ్యాయి.పార్టీ కేంద్ర పెద్దలు అనుమతిస్తే షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.కానీ ఆ అనుమతి ఇవ్వకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అంటూ సంజయ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్ర ద్వారా సంజయ్ తన గ్రాఫ్ పెంచుకుంటే, తమ ప్రభావం తగ్గిపోతుంది అనే భయం కిషన్ రెడ్డి లో మొదలవడంతోనే ఆయన ఈ యాత్రకు బ్రేకులు వేయించారనే ప్రచారం జరుగుతోంది.ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని, సంజయ్ కిషన్ రెడ్డి వేరువేరు వర్గాలుగా ఉన్నారని, ఆధిపత్య పోరు తీవ్రతరం అయిందనే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్ర కు బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది.