2019 ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి పెద్దగా పవన్ రాజకీయాలపై ఆసక్తి లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఎన్నికలు ముగిసిన అనంతరం కొంతకాలం పాటు వైసీపీ ప్రభుత్వం పై విమర్శ చేస్తూ, వివిధ సమస్యలను హైలెట్ చేస్తూ రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నారు.
ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ, రాజకీయాలపై అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా మాత్రమే విమర్శలు చేస్తున్నారు.
పార్టీ కార్యక్రమాలు ఏవైనా, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు చూసే నాదెండ్ల మనోహర్ మాత్రమే చక్కబెడుతున్నారు.అయితే పవన్ ఈ విధంగా వ్యవహరించడం వల్ల రాబోయే రోజుల్లో జనసేనకు భవిష్యత్ ఉండదని, రాజకీయంగా పూర్తిగా పట్టు కోల్పోయే ప్రమాదం ఉందనే అనేక సూచనలు అందడంతో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీకి ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం అవుతోంది.ఈ విషయంలో దూకుడుగా ఉంటుంది.దానిని అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తో పాటు, అధికార పార్టీ వైసిపి పూర్తిగా విఫలం కావడంతో, ఆ అంశాన్ని హైలెట్ చేసి ప్రజల మెప్పు పొందాలని చూస్తున్నారట.బీజేపీతో తమ పార్టీకి పొత్తు ఉన్నా, ఆ పార్టీ నేతలు ఎవరూ తమను కలుపుకుని వెళ్లకపోవడం, పొత్తు ఉన్నా, నిరుపయోగంగా ఉండడం, బిజెపికి పెద్దగా బలం లేకపోవడం, ఇలా ఎన్నో అంశాలను పవన్ పరిగణలోకి తీసుకుంటున్నారు.
అందుకే విశాఖ ఉక్కు కార్మికులకు అండగా నిలబడి వారితో ప్రత్యక్షంగా పోరాటాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారట.ఈ విషయంలో తామ పై బీజేపీ ఒత్తిడి తెచ్చినా, వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అది కాకుండా ఏపీలో గో వధ నిషేధం, టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు తదితర అనవసర వివాదాల పై పోరాటం చేసేందుకు బిజెపి ఎక్కువ మొగ్గు చూపుతోందని, కానీ ప్రధానమైన సమస్యలను ఆ పార్టీ పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్నారు.ప్రస్తుతం విశాఖ ఉక్కు దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పవన్ ను స్టీల్ ప్లాంట్ దీక్షకు దిగాల్సిందే అంటూ పట్టుబడుతున్నారట.
రాజకీయంగా జనసేన కు, గంటాకు ఇది లబ్ది చేకూర్చుతుందనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడకు దిగినట్లు తెలుస్తోంది.గంటా సూచనలతో పవన్ ఇప్పుడు బీజేపీని పక్కన పెట్టి మరీ పోరాటం చేసి ఈ విషయంలో కేంద్రం దిగివచ్చేలా చేయాలనేది పవన్ ఎత్తుగడగా కనిపిస్తోంది.