సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను శుక్రవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసిన సంగతి తెలిసిందే.దాదాపుగా 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డ్ తెలిపింది.కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పరీక్షలు రద్దుచేయడంతో మెరిట్ లిస్ట్ను ప్రకటించలేదు.
ఈ ఏడాది 13,04,561 మంది ఫలితాలను బోర్డు వెల్లడించింది.దేశవ్యాప్తంగా విడుదలైన ఫలితాల్లో ఢిల్లీ విద్యార్ధులు సత్తా చాటారు.ఇక్కడ రికార్డు స్థాయిలో 99.84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపింది.70,004 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించగా.1,50,152మంది విద్యార్థులు 90శాతం పైగా మార్కులు సాధించినట్టు సీబీఎస్ఈ వెల్లడించింది.
మరోవైపు గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన లక్షలాది భారతీయ కుటుంబాలు తమ పిల్లలను అక్కడి భారతీయ విద్యాసంస్థల్లో సీబీఎస్ఈ సిలబస్లో చదివించుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా విడుదలైన సీబీఎస్ఈ గ్రేడ్-12 పరీక్ష ఫలితాల్లో అబుధాబిలోని భారతీయ విద్యా సంస్థలు సత్తా చాటాయి.
ఇక్కడ ఎన్నో స్కూల్స్ వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.వీటిలో మోడల్ స్కూల్ అబుధాబి కొత్త చరిత్ర సృష్టించింది.గ్రేడ్-12లో మొత్తం 38 విద్యార్థులు ఉంటే అందరూ ఉత్తీర్ణత సాధించారు.వీరిలో ఐదుగురు 95 శాతం మార్కులు సాధించగా, మరో 10 మంది 90 శాతానికి పైగా మార్కులు సాంధించారు.ఈ స్కూల్ సగటు మార్కుల స్కోర్ 85.14 ఉండడం విశేషం.96.8 శాతం మార్కులతో దిల్జీత్ పీడీ అనే విద్యార్థి స్కూల్ టాపర్గా నిలిచినట్లు యాజమాన్యం ప్రకటించింది.
అటు అబుధాబి ఇండియన్ స్కూల్ కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.మొత్తం 290 మంది విద్యార్థుల్లో 95 మంది 90 శాతానికి పైగా మార్కులు సాధించారు.శ్రావణ్ క్రిష్ణ అనే విద్యార్థి 98.6 శాతం మార్కులతో టాపర్గా నిలిచాడు.షైనింగ్ స్టార్ ఇంటర్నెషనల్ స్కూల్ సైతం వంద శాతం ఉత్తీర్ణత సాధించింది.
కాగా, కరోనా పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు.ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షలను రద్దు చేయడంతో 12వ తరగతి విద్యార్థుల ఫలితాల ప్రకటనకు నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాలని సీబీఎస్ఈకి సూచించారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫలితాలను ఏ విధంగా ప్రకటించాలనే దానిపై 13 మందితో కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగానే సీబీఎస్ఈ ఫలితాలపై కసరత్తు చేసి శుక్రవారం ప్రకటించారు.