ప్రస్తుతం బిజెపితో వ్యవహారాన్ని తెగే వరకు లాగేసుకున్నారు ఏపీ సీఎం జగన్.మొన్నటి వరకు మొహమాటాలు అన్నట్లుగా ఉన్న బిజెపి వైసీపీ మధ్య బంధం ఇప్పుడు తెగతెంపులు అయ్యే వరకు వచ్చింది.
జగన్ కోరిన కోరికలు తీర్చకపోగా, ఇబ్బంది పెట్టే విధంగా బిజెపి కేంద్ర పెద్దలు వ్యవహరిస్తుండడం, తాము ఆపద సమయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చినా, కేంద్రం మాత్రం తమ విషయంలో కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుండడం, ఇలా అనేక కారణాలతో బీజేపీ పై జగన్ విరక్తి చెందినట్టుగానే గత కొంత కాలం గా కనిపిస్తున్నారు.ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోసం ఆయన పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు, ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటం తదితర కారణాలతో ఆయన జగన్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నిటినీ కాంగ్రెస్ కు దగ్గర చేసేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
ప్రశాంత్ కిషోర్ విషయంలో జగన్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటారు.
ఆయన ఆషామాషీగా వ్యూహాలు రూపొందించరని ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగనే అన్ని ప్లాన్ చేస్తూ ఉంటారనే విషయాన్ని జగన్ నమ్ముతున్నారు.దాన్ని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ కూటమి వైపు కు జగన్ ను తీసుకురావాలని, అలా వస్తేనే రాబోయే రోజుల్లో ఏ ఇబ్బందులు ఉండవనే విషయాన్ని జగన్ కు నేరుగా ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇవే కాకుండా అనేక కీలక అంశాల గురించి జగన్ వద్ద ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించినట్లు, దానికి జగన్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కి అనుకూలంగా వ్యవహరించకపోతే, తమ ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు వస్తాయని, అలాగే జగన్ కు కూడా వ్యక్తిగతంగా చాలా డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ వద్ద ప్రస్తావించగా, దానికి సానుభూతి కోణంలో వెళితే వర్కవుట్ అవుతుందనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు సమాచారం.అయితే దీనిపై పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి, నిర్ణయించుకుని అప్పుడు తగిన కార్యాచరణ రూపొందించుకుంటాము అనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ కు విజయసాయిరెడ్డి ద్వారా జగన్ వర్తమానం పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ ఒత్తిడితో జగన్ కాంగ్రెస్ దగ్గరయ్యే విధంగానే కనిపిస్తున్నారు.