సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి గొప్ప పేరు సంపాదించుకున్న దర్శకులలో కట్టా సుబ్బారావు ఒకరు.కోనసీమ రాజోలుకు చెందిన ఈ దర్శకుడు సుమారు 30 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు.
దర్శకులు కె.ప్రత్యగాత్మ దగ్గర 15 సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా పనిచేసిన ఈ డైరెక్టర్ మొట్టమొదటిసారిగా కృష్ణ జయప్రద జంటగా నటించిన“వియ్యాలవారి కయ్యాలు”సినిమాకు దర్శకుడిగా పరిచయమయ్యారు.సుమారు తన పది సంవత్సరాల కాలంలో 30 సినిమాలకు దర్శకత్వం వహించి ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నారు.
సుబ్బారావు దర్శకత్వం వహించిన సినిమాలలో కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, గడసరి అత్త సొగసరి కోడలు, బంగారు బావ, కాలరుద్రుడు, శ్రీరస్తు శుభమస్తు, మాంగల్యబంధం వంటి అద్భుతమైన సినిమాలు ఉన్నాయి.
సుబ్బారావు అప్పట్లోనే కృష్ణ, ఎన్టీఆర్, రాధిక, శ్రీదేవి వంటి తారలతో“వయ్యారి భామలు వగలమారి భర్తలు” అనే సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు పొందిన ఈ స్టార్ డైరెక్టర్ తన ఆరోగ్య విషయం గురించి అతి పెద్ద విషయాన్ని దాచి పెట్టారు.సుబ్బారావు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ ఈ విషయం తన కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా ఎంతో జాగ్రత్తగా మందులు ఉపయోగిస్తూ సినిమా షూటింగ్ లో పాల్గొనేవారు.తనకు క్యాన్సర్ అన్న విషయం తన భార్య పిల్లలకు కూడా తెలియలేదు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది.అప్పటికే అతని పరిస్థితి విషమంగా ఉండడం చేత జూలై 3 1988 లో మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సుబ్బారావు మరణించినప్పటికి అతని వయసు 49 సంవత్సరాలు.ఇతనికి ఐదు మంది కుమారులు ఉండగా వారిలో పెద్దబ్బాయి శ్రీకర్ ప్రసాద్ తండ్రి బాటలోనే నడుస్తూ దర్శకుడిగా మారారు.