గతంతో పోలిస్తే టిడిపి యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాగా బలం పుంజుకున్న.రాజకీయంగా కాస్త ఫర్వాలేదు అన్నట్లుగానే ఆయన వ్యవహారం ఉంది.
పార్టీలో లోకేష్ గురించి మొన్నటి వరకు ఉన్న అన్ని అపోహలు తొలగిపోతున్నాయి.లోకేష్ నాయకత్వంలో అధికారంలోకి వస్తామని కొంతమంది మీడియా ముందు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వం పైన, వైసీపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, రాజకీయంగా తన పరపతిని లోకేష్ పెంచుకుంటూ వస్తున్నారు.ఇక చంద్రబాబు రాజకీయంతో అంతగా యాక్టివ్ గా ఉండే పరిస్థితులు కనిపించకపోవడంతో, అన్నీ తానే అన్నట్టుగా లోకేష్ రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, పార్టీ నాయకుల్లో లోకేష్ పై నమ్మకం ఉన్నా, చంద్రబాబులో మాత్రం ఇంకా ఆ నమ్మకం కనిపించడం లేదట.దీనికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా లోకేష్ ను మంత్రిగా చేసేందుకు చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడకపోయినా, పార్టీ నేతల ఒత్తిడితో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు.అయితే ఆ సమయంలో చంద్రబాబు మాటను సైతం లోకేష్ లెక్కచేయకుండా వ్యవహరించారని , కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తికి గురై వివిధ పార్టీల లో చేరిపోవడానికి లోకేష్ కారణం అయ్యాడనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నారు.
అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా యాక్టివ్ గా లోకేష్ ఉంటున్నారు.క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.చంద్రబాబు మాత్రం ఈ యాత్రలకు ఇష్టపడం లేదట.దీనికి కారణం లోకేష్ ఎక్కువగా గ్రూపులను ప్రోత్సహిస్తారని, కేవలం కొంతమంది నాయకులకు, ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన వారిని పట్టించుకోరని, దీని కారణంగా పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలవుతుంది అని బాబు కంగారు పడుతున్నారట.
లోకేష్ పనితీరు ఆశాజనకంగా కనిపిస్తున్నా, అది ఏమాత్రం సరిపోదని, వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే పార్టీలో ఎక్కడా అసంతృప్తులు తలెత్తకుండా, మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే అంతటి శక్తి సామర్ధ్యాలు సంపాదించాలి అనేది చంద్రబాబు అభిప్రాయంగా ఉందట.