అమెరికాలో రోజు రోజుకు కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్న అమెరికన్స్ తాజాగా డెల్టా వేరియంట్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
గడిచిన 24 గంటలలో అమెరికా వ్యాప్తంగా దాదాపు 88 వేల కేసులు నమోదు అవడం పెద్దన్న వెన్నులో వణుకు పుట్టిస్తోంది.కొన్ని రోజుల క్రితం మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన అధ్యక్షుడు బిడెన్ సైతం మాస్క్ తప్పని సరి అంటూ తాజాగా ప్రకటన చేయడంతో అమెరికన్స్ లో మరింత ఆందోళన నెలకొంది.
జులై 25 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు గా నమోదు కాగా జులై 17 తేదీ తో పోల్చుకుంటే దాదాపు 130 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, మాస్క్ నిభందనలు మళ్ళీ అమలు చేశామని తెలిపింది.అలాగే స్కూల్, కాలేజీలలో పిల్లలు, విద్యార్ధులు మాస్క్ లు ధరించాలని అలా చేయని వారిపై కటైనమైన చర్యలు చేపడుతామని తెలిపింది.
కరోనా ప్రభావవంతమైన ప్రాంతాల వారు ఈ నిభందనను తప్పకుండా పాటించాలని సూచించింది.
ప్రభుత్వం కొత్త ఆదేశాల జారీ నేపధ్యంలో న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో నగరాలలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాలను మూసివేస్తున్నట్టుగా ట్విట్టర్ ప్రకటించింది.ఉద్యోగుల రక్షణ మాకు ముఖ్యమని గతంలో చేసిన విధంగానే ఉద్యోగులు ఇళ్ళ నుంచీ వర్క్ చేస్తారని, బహుశా భవిష్యత్తులో శాశ్వతంగా ఇళ్ళ నుంచీ పనిచేసే పరిస్థితులు వస్తాయని తెలిపింది.ఇదిలాఉంటే భవిష్యత్తు లో మరిన్ని కంపెనీలు స్వచ్చందంగానే తమ ఉద్యోగులను ఇళ్ళ నుంచీ శాశ్వతంగా పనిచేసేలా చర్యలు చేపడుతాయని, ప్రస్తుతం అమెరికా లాక్ డౌన్ దిశగా వెళ్లేందుకు ప్రజలను సమాయత్తం చేస్తోందని అంటున్నారు నిపుణులు.