అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతీయులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.ఆయన పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇండో అమెరికన్లకు కీలక పదవులు దక్కుతూనే వున్నాయి.
తాజాగా భారత సంతతికి చెందిన పర్యావరణ నిపుణురాలు జైనే భావిషిని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్లో (ఎన్ఓఏఏ) కీలక పదవికి నామినేట్ చేస్తున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది.
ఎన్ఓఏఏ అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తున్న శాస్త్రవేత్త రిక్ స్పిన్రాడ్కు అగ్రశ్రేణి సహాయకులలో ఒకరిగా భావిషి వ్యవహరిస్తారు.
రిక్ను ఈ ఏడాది ఏప్రిల్లో జో బైడెన్ నామినేట్ చేయగా.గత నెలలో ఆయన నియమాకాన్ని సెనేట్ ధ్రువీకరించింది.
బైడెన్ పరిపాలనా యంత్రాంగం వాతావరణ మార్పులను ఎదుర్కోవడాన్ని తన ప్రాధాన్యతలతో ఒకటిగా చేసింది.అమెరికా తీరం, మహా సముద్రాలు, మత్స్యకారులను పర్యవేక్షించడం, రక్షించడం వంటి బాధ్యతలను భావిషి నిర్వర్తించాల్సి వుంటుంది.
భావిషి ప్రస్తుతం న్యూయార్క్ మేయర్ ఆఫీస్ ఆఫ్ క్లైమేట్ రెసిలెన్సీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.అక్కడ వాతావరణ మార్పుల ప్రభావంపై నగరాన్ని సిద్ధం చేసే బృందానికి ఆమె నాయకత్వం వహించారు.
న్యూయార్క్లోని నిర్మాణాలు, నివాసులను రక్షించడానికి ఈ కార్యాలయం అనేక కార్యక్రమాలతో పనిచేస్తోంది.వీటిలో వరదలను అడ్డుకునే విధంగా గోడలు, గేట్లతో కూడిన 2.4 మైళ్ల పొడవైన వరద రక్షణ వ్యవస్థను నెలకొల్పడంతో పాటు మన్హట్టన్లో అండర్ గ్రౌండ్ పారుదల వ్యవస్థను మెరుగుపరచడం ముఖ్యమైనవి.
భావిషి నియామకం పట్ల న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో హర్షం వ్యక్తం చేశారు.ఆమె నాయకత్వం, దూర దృష్టి న్యూయార్క్ నగర తీర ప్రాంతాన్ని మార్చి వేసిందని ప్రశంసించారు.న్యూయార్క్ వాసులను విధ్వంసక వరదలు, ఘోరమైన వేడి గాలుల నుంచి రక్షించారని బిల్ డి బ్లాసియో అన్నారు.
భావిషి నియామకాన్ని సెనేట్ ధ్రువీకరించినట్లయితే ఆమె వాణిజ్య శాఖలో మహాసముద్రాలు, వాతావరణానికి సంబంధించి సహాయ కార్యదర్శిగా వుంటారు.కానీ ఆచరణలో మాత్రం కామర్స్ డిపార్ట్మెంట్లో వున్న ఎన్ఓఏఏలో ఆమె కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగానికి కార్యదర్శిగా పనిచేస్తారు.
న్యూయార్క్ మేయర్ కార్యాలయంలో పనిచేయడానికి ముందు.ఆమె ఒబామా హయాంలో వైట్హౌస్ కౌన్సిల్ ఆన్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీలో ఎన్ఓఏఏకి సీనియర్ పాలసీ అడ్వైజర్గా వున్నారు.దీనికి ముందు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి హవాయికి చెందిన ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యమైన ఆర్3ఏడీవై ఆసియా పసిపిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు.అలాగే హవాయి యూనివర్సిటీ అధ్యక్షుడు డేవిడ్ లాస్నర్తో కలిసి పనిచేశారు.
కాగా, ఎన్ఓఏఏ కార్యకలాపాలకు మరింత ఊతం అందించేందుకు బైడెన్ యంత్రాంగం చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా ఏజెన్సీ కోసం 7 బిలియన్ డాలర్లను బడ్జెట్లో కేటాయించింది.
ఇది ఎన్ఓఏఏ చరిత్రలో అత్యధిక మొత్తం.