పురుషాధిక్య సమాజంలో అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం మహిళలు దూసుకెళ్తున్నారు.మగవాళ్లకే సొంతమనుకున్న రంగాల్లోనూ ప్రవేశించి సత్తా చాటుతున్నారు.
అయినప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే వుందని పలు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.మహిళా అధినేతలు రాజ్యాలను ఏలుతున్న దేశాల్లోనూ మగవారిదే పెత్తనం.
తాజాగా మహిళగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేశారు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ స్వాతి మోహన్.
దేశం కానీ దేశంలో ఒక భారతీయురాలిగా కంటే మహిళగానే తాను ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని స్వాతి తెలిపారు.
ప్రస్తుతం ఆమె నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో గైడెన్స్, నావిగేషన్ , కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ గ్రూప్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ‘‘డయాస్పోరా డిప్లొమసీ’’లో స్వాతి మోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాసా చాలా విభిన్నమైన సంస్థ అని అందులో భిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ప్రవాసులు వున్నారని తెలిపారు.
నాసా మార్స్ 2020 ప్రాజెక్ట్లో జేపీఎల్ విభాగంలో ఎంతోమంది భారతీయ అమెరికన్లు పనిచేస్తున్నారని స్వాతి మోహన్ వెల్లడించారు.భారతదేశ సంస్కృతిని అర్థం చేసుకోలేని, అభినందించలేదని వ్యక్తుల నుంచి తొలినాళ్లలో తాను విమర్శలు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు.
తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించిన స్వాతి.వ్యక్తిగత జీవితంతో కెరీర్ను బ్యాలెన్స్ చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నించానని తెలిపారు.భాగస్వామిగా తన భర్త ఎంతగానో ప్రోత్సహించారని ఆమె అన్నారు.విద్యార్ధులు నిజాయితీగా వుండాలని, తమను తాము తెలుసుకోవాలని స్వాతి మోహన్ సూచించారు.లక్ష్యాలకు అనుగుణంగా అవకాశాలను వెతకాలని, విజయం కంటే వైఫల్యమే మనకు ఎక్కువ పాఠాలను నేర్పుతుందని, ఎల్లప్పుడు పట్టుదల అవసరమన్నారు.
కాగా, భారత్లో పుట్టిన స్వాతి మోహన్కు ఏడాది వయసున్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు వలసవెళ్లింది.నార్తర్న్ వర్జీనియా-వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో ఆమె తన బాల్యాన్ని గడిపారు.మెకానికల్-ఏరోస్పేస్ ఇంజనీరింగ్ను కార్నెల్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు స్వాతి.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్-ఆస్ట్రోనాటిక్స్లో ఎంఎస్, పీహెచ్డీ చేశారు.అనంతరం నాసాలో అడుగుపెట్టిన స్వాతి మోహన్ ఎన్నో మిషన్లలో పాలుపంచుకున్నారు.
శని గ్రహంపై పంపిన కాసిని మిషన్, మూన్ మీదకు వెళ్లిన గ్రెయిల్ కోసం కూడా ఆమె పనిచేశారు.మార్స్ మిషన్ 2020కి నాసా 2013లోనే శ్రీకారం చుట్టింది.
ఈ ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి స్వాతి తీవ్రంగా శ్రమించారు.కాలిఫోర్నియాలోని పసడేనాలో ఉన్న నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీలో ప్రస్తుతం స్వాతి పనిచేస్తున్నారు.