మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్ హోరాహోరీగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.నియోజకవర్గంలోని ప్రతి పల్లెను సందర్శిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
తన కారణంగానే టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలు పెట్టి కొన్ని సామాజిక వర్గాల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది అని రాజేందర్ పాదయాత్రలో ప్రచారం చేసుకుంటున్నారు.ముఖ్యంగా కేసీఆర్ తీసుకు వచ్చిన దళిత బంధు, పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు ఇవన్నీ తన కారణంగానే అమలు చేస్తున్నారని, ఇక్కడ తనను గెలిపించి అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేయాలి అంటూ ప్రజలను ఆయన కోరుతున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా , ఈ రాజేందర్ వ్యవహారం బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది.దీనికి కారణం లేకపోలేదు.ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజేందర్ ఎక్కడ బిజెపి పేరును ప్రస్తావించకుండా తనను చూసి ఓటు వేయాలంటూ ప్రజలను కోరుతూ ఉండడం, కేవలం తన ఇమేజ్ ఆధారంగానే ఇక్కడ గెలిచేందుకు ప్రయత్నించడం, అంతగా బిజెపి విషయాన్ని ప్రస్తావించకపోవడం ఇవన్నీ ఆ పార్టీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.తాజాగా జమ్మికుంట మండలం గండ్రపల్లి సభలో మాట్లాడిన రాజేందర్ బిజెపిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు.
హుజురాబాద్ ప్రజలు ఎప్పుడు తనకు అండగా నిలవాలని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో పార్టీల పరంగా ఎవరు చూడవద్దని, మా పార్టీని కాకుండా, నన్ను చూసి ఓటు వేయాలంటూ రాజేందర్ కోరుతున్నారు.
ఎంతగా ఓట్ల కోసం తాను ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదని, మీ గుండెల్లో తాను స్థానం సంపాదించుకున్న అని, మళ్లీ తనను గెలిపించాలని రాజేందర్ కోరుతున్నారు.ఇంత వరకు బాగానే ఉన్నా బీజేపీని కాదని తనను చూసి ఓట్లు వేయాలి అంటూ రాజేందర్ కొరుతుండడం పైనే ఇప్పుడు బీజేపీలో అనేక అనుమానాలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.వాస్తవంగా టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత రాజేందర్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది.
అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా కేసులు నమోదు చేస్తూ ఉండడం, అనేక విచారణలకు దిగడం ఇలా అనేక కారణాలతో వారిని అడ్డుకునేందుకు రాజేందర్ కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ లో చేరారు.
రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.దీంతో ఉప ఎన్నికల తరువాత రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం మొదలైంది.ప్రస్తుతం బిజెపి లో రాజేందర్ ఇమడలేకపోతున్నారని, అదీ కాకుండా ఆ పార్టీ కారణంగా కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారనే రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి.
.