భారత సంతతికి చెందిన బ్రిటీష్ రచయిత సంజీవ్ సహోతా ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2021 తుది పోరులో నిలిచారు.ఆయన రచించిన చైనా రూమ్ నవలకు గాను ఈ ఘనత దక్కింది.
ఈ మేరకు 2021 లాంగ్ లిస్ట్ ‘ ద బుకర్ డజన్ ’’ పేరుతో నిర్వాహకులు 13 నవలల జాబితాను మంగళవారం విడుదల చేశారు.అక్టోబర్ 1, 2020 తర్వాత బ్రిటన్, ఐర్లాండ్లలో ప్రచురితమైన 158 నవలలను వడపోసి ఈ తుది జాబితాను నిర్వాహకులు ప్రచురించారు.ఈ జాబితాలో నోబెల్ గ్రహీత కాషివో ఇషగురో, పులిట్జర్ విజేత రిచర్డ్ పావజ్ వంటి దిగ్గజాలు కూడా వున్నారు.
40 ఏళ్ల సంజీవ్ 2015 బుకర్ ప్రైజ్కు నామినేట్ అయ్యారు.ప్రస్తుతం తన చైనా రూమ్ నవలతో 69,000 డాలర్ల బహుమతి కోసం తుది జాబితాలో పోటీపడుతున్నారు.ఇక 2017లో సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న బ్రిటన్ రచయిత ఇషిగురో తన ‘‘ క్లారా అండ్ ది సన్ ’’ నవలకు గాను తుది జాబితాలో నిలిచారు.ప్రేమ, మానవత్వం గురించి ఆయన ఈ నవలలో అద్భుతంగా వర్ణించారు.1989లో ‘‘ ది రిమైన్స్ ఆఫ్ ది డే ’’కు గాను బుకర్ ప్రైజ్ను అందుకున్న ఇషిగురో నాల్గవ సారి నామినేట్ అవ్వడం విశేషం.
ఈ ఏడాది బుకర్ ప్రైజ్ జడ్జింగ్ ప్యానెల్కు చరిత్రకారుడు మాయ జాసనోఫ్ చైర్గా వ్యవహరిస్తారు.రచయిత, ఎడిటర్ హోరాటియా హరోడ్, నటుడు నటాస్చా మెక్ లెఫోన్, ప్రొఫెసర్ చిగోజీ ఒబియోమా, రచమిత రోవాన్ విలియన్స్లు సభ్యులుగా వ్యవహరిస్తారు.
ఇక ఈ 13 నవలలో నుంచి ఆరు పుస్తకాలను షార్ట్ లిస్ట్ చేసి సెప్టెంబర్ 14న ప్రకటిస్తారు.తుది విజేతను నవంబర్ 3న లండన్లో జరిగే కార్యక్రమంలో సత్కరిస్తారు.
కాగా, బుకర్ ప్రైజ్-2020ను స్కాటిష్-అమెరికన్ రచయత డగ్లస్ స్టువార్ట్ గెలుచుకున్నారు.డగ్లస్ రచించిన తన ఆత్మకథ ‘‘షుగ్గీ బెయిన్’’కు ఈ అవార్డు దక్కింది.1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల ఆధారంగా షుగ్గీబెయిన్ నవలను మలచారు.స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో 1971, మే 31 జన్మించిన డగ్లస్ లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
అనంతరం అమెరికాలోని న్యూయార్క్కు వచ్చారు.షుగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు.
బుకర్ ప్రైజ్ పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్ ఈ బహుమతి పొందారు.పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారత సంతతికి చెందిన రచయిత అవని దోషి కూడా ఉన్నారు.