ఇప్పటికే బిజెపి వైసిపి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతూనే వస్తోంది.కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఈ రెండు పార్టీల మధ్య వివాదం తారస్థాయికి చేరింది.
ప్రతి విషయం పైన రాజకీయ పంతంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఒకరినొకరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.తాజాగా జగన్ సొంత జిల్లా కడప లోని ప్రొద్దుటూరు లో బిజెపి వైసిపి మధ్య వివాదం మొదలైంది.
పొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుండటం పై బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా, ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగింది.ఇప్పటికే కర్ణాటకలో టిప్పుసుల్తాన్ జయంతి కార్యక్రమాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ఇప్పుడు ఏపీ సీఎం సొంత జిల్లాలో ఏర్పాటవుతున్న విగ్రహం పైన అంతే స్థాయిలో వ్యతిరేకత చూపిస్తోంది.
ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్ లో ఏర్పాటు చేయబోతున్న టిప్పుసుల్తాన్ విగ్రహం భూమిపూజ ను అడ్డుకునేందుకు తాజాగా ఏపీ బీజేపీ నేతలు పొద్దుటూరు చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న రాత్రి పొద్దుటూరు చేరుకున్నారు.
ఈరోజు చేపట్టబోయే భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ విషయం తెలియడంతో ఎక్కడెక్కడ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అయినా బిజెపి నేతలు ఈ రోజు పోలీసులు చుట్టుముట్టి వారి నుంచి తప్పించుకుని విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి వచ్చి ధర్నా నిర్వహించారు.దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.టిప్పు సుల్తాన్ లాంటి క్రూరుడి విగ్రహానికి బదులు, భారతదేశానికి ఎంతో మేలు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వీర్రాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయినా వైసీపీ ఈ విగ్రహ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేలా అయితే కనిపించకపోవడంతో ఈ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.