మధుమేహం… షుగర్.చక్కెర వ్యాధి, పేరు ఏదైనా ప్రస్తుతం కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో ఇది కూడా ఒకటి.
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికి ఈ వ్యాధి సోకుతోంది.స్లో పాయిజన్లా మనిషిని నిర్వీర్యం చేస్తూ.
చాపకింద నీరులా ప్రపంచ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ మధుమేహాన్ని కట్టడి చేయడానికి పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదు.ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోంది.
ఒకప్పుడు మలేరియా, కలరా, క్షయ తదితర వ్యాధులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవి.ఇవి సోకితే ఆ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా జీవించాల్సి వచ్చేది.
ఈ వ్యాధులను ఆధునిక వైద్య శాస్త్రం చాలా వరకు కట్టడి చేసింది.అలాంటి ప్రాణాంతకమైన వ్యాధుల జాబితాలో చేరిన మధుమేహాన్ని నిర్మూలించడం ఇప్పుడు వైద్య రంగానికే ఓ సవాలుగా మారింది. ఇక ఏ వ్యాధికైనా నిర్థారణ అతి ముఖ్యం.దీని వల్లనే పరిస్ధితి ఎలా వుంది.ఎలాంటి మందులు వాడాలి అన్నది వైద్యుడికి తెలుస్తోంది.అయితే షుగర్ వ్యాధి నిర్ధారణ అనేది కత్తి మీద సాము లాంటిదే.
ఎందుకంటే మధుమేహం సోకిన వారికి ఎక్కడైనా సూది గుచ్చి అక్కడి నుంచి నమూనాలను సేకరించాలంటే కాస్త వణకాల్సిందే.దీనికి కారణం లేకపోలేదు.
షుగర్ వచ్చిన వారికి శరీరంలో ఎక్కడైనా గాయమైతే అది త్వరగా మానదు.కాలక్రమంలో అది తీవ్రంగా మారి.
ఆ అవయవాన్ని తీసివేయాల్సిన పరిస్ధితి రావొచ్చు.ఇలాంటి అవరోధాలను అధిగమించేందుకు ఆధునిక వైద్య శాస్త్రం కొత్త తరహా నిర్ధారణా పరీక్షలను అభివృద్ధి చేస్తోంది.
ఈ క్రమంలోనే బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూక్యాజిల్ పరిశోధకులు సూది వాడకుండా షుగర్ టెస్ట్ చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు.ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన డాక్టర్ పంకజ్ కుమార్ కూడా భాగం పంచుకున్నారు.ఈ విధానం ప్రకారం రోగి లేదా అనుమానితుడి లాలాజలం ఆధారంగా గ్లూకోజ్ పరీక్ష చేస్తారు.ఇది ప్రపంచంలోనే తొలి సూది రహిత చక్కెర పరీక్షగా వారు వెల్లడించారు.
ప్రొఫెసర్ పాల్ దస్తూర్ నేతృత్వంలోని ఈ పరిశోధన బృందంలో భౌతిక, జీవ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, రసాయన శాస్త్రవేత్తలు వున్నారు.
ఇక పంకజ్ విషయానికి వస్తే.
ఈయన భారత్ నుంచి యూకేకు వలస వచ్చారు.భౌతిక శాస్త్రవేత్త అయిన పంకజ్కు.
ఆర్గానిక్ సెమికండక్టర్స్ , పరికరాలపై పూర్తి అవగాహన వుంది.ఆ అనుభవాన్ని ఈ పరిశోధనకు ఉపయోగించారు.
ఈ కొత్త షుగర్ నిర్థారణా విధానంలో.సహజ ఎంజైమ్తో కోటింగ్ వేసిన ప్లాస్టిక్ ట్రిప్పై లాలాజలాన్ని వేసినప్పుడు.
అది ఖచ్చితమైన గ్లూకోజ్ స్థాయిలను చూపిస్తోంది.
స్వతహాగా భారతీయుడిని కావడం వల్ల తనకు డయాబెటిస్ గురించి ఎప్పుడూ ఆందోళనగానే వుంటుందని పంకజ్ మీడియాకు తెలిపారు.సైన్స్, టెక్నాలజీ ద్వారా తన తోటి భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహకరిస్తానని ఆయన వెల్లడించారు.అంతర్జాతీయ నివేదికల ప్రకారం.2019 నాటికి 77 మిలియన్ల మంది భారతీయులు డయాబెటిస్తో బాధపడుతున్నారని పంకజ్ తెలిపారు.
న్యూక్యాజిల్ యూనివర్సిటీలో చేరడానికి ముందు పంకజ్ కుమార్ న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేశారు.
అక్కడ ఆర్గానిక్ సెమీ కండక్టర్స్, పరకరాలపై దశాబ్ధాలుగా పరిశోధనలు చేశారు.ఆర్గానిక్ సెమీ కండక్టర్స్పై పరిశోధనలు చేసి 2010లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి పంకజ్ పీహెచ్డీ పట్టా పొందారు.2013లో ఇండో ఆస్ట్రేలియా ఎర్లీ కెరీర్ రీసెర్చ్ ఫెలోషిప్ను పంకజ్ పొందారు.