పదేళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటే పూర్తిగా పతనావస్థకు చేరిపోయింది.రాబోయే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి తప్పదు అనే విధంగా పరిస్థితి తయారైంది.
కాంగ్రెస్ బలహీనం కావడంతో, రెండో సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది.ప్రస్తుతం బిజెపి పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్నా, కాంగ్రెస్ పేరు మాత్రం వినిపించడంలేదు.
మూడో ప్రత్యామ్నాయం రావాల్సిందే అనే డిమాండ్ పెరుగుతోంది.అయితే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని, నిరాశ నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు.
అందుకే ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ, కీలక పదవి పై కన్నేసిన నాయకులందరినీ మొహమాటం లేకుండా పక్కన పెట్టారు.మధ్యలో కాంగ్రెస్ లో చేరిన నేతలైనా.
పార్టీని పరుగులు పెట్టించేగలరు, భవిష్యత్తులో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురాగలరు అని నమ్మకం ఉన్న, దూకుడు కలిగిన నేతలను పీసీసీ చీఫ్ లుగా నియమించారు.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా పరిస్థితి ఉండడంతోనే పార్టీ కమిటీల్లో మార్పులు చేర్పులు చేసి, యువ నాయకులకు, దూకుడుగా పార్టీని ముందుకు తీసుకు వెళ్లి అధికారంలోకి తీసుకు రాగలరు అని నమ్మకం ఉన్న నేతలందరికీ పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయంలో పార్టీ సీనియర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగానే రాహుల్ వ్యవహరిస్తున్నారు.తెలంగాణలో రేవంత్ రెడ్డి పంజాబ్ లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహారాష్ట్రలో నానా పటోలే వంటి వారి నియామకం చూస్తుంటే రాహుల్ ఎత్తుగడ ఏమిటో అర్థమవుతుంది.
త్వరలోనే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు, చాలా రాష్ట్రాల్లో పిసిసి అధ్యక్షులను మార్చి , చురుకైన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.అయితే ఇతర పార్టీల నుంచి కొద్దికాలం క్రితమే పార్టీలో చేరిన వారికి కీలక పదవులు ఎలా ఇస్తారు అంటూ రాహుల్ పై ఒత్తిడి పెరుగుతున్నా పట్టించుకోనవసరం లేదని, కాంగ్రెస్ లో దశాబ్దాలుగా ఉన్నా, పార్టీని ముందుకు తీసుకు వెళ్లడం లో విఫలమవుతున్న నాయకులు వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు అనేది రాహుల్ అభిప్రాయం.అందుకే యువ నాయకులకు, చురుకైన వారిని ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా నియమిస్తూ, రాబోయే ఎన్నికలలో అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉండేలా రాహుల్ చూసుకుంటున్నారు.