తమ పార్టీ నుంచి గెలిచి, తమపైనే అస్థ్రాలు వదులుతూ రాజకీయంగా ఎవరూ పెట్టనంత ఇబ్బంది పెడుతున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసిపి చాలా సీరియస్ గానే ఉంది.ఆయన పై అనర్హత వేటు వేయకపోతే, తమ పరువు, తమ పార్టీ పరువు పోతుందని జగన్ అభిప్రాయపడుతున్నారు.
ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీ నుంచి గెలిచినా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చినా, అనేక సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తూ , ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా, రఘురాము వ్యవహారంతో పూర్తిగా అభాసుపాలు కావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని, ఇది తమకు చాలా అవమానకరంగా ఉందనేది జగన్ అభిప్రాయం.అందుకే బీజేపీ పై ఎప్పుడూ లేనంత ఒత్తిడి చేస్తూ, అనర్హత వేటు వేయాల్సిందిగా వైసిపి పట్టుబడుతోంది.
అనేక విషయాల్లో ఏపీకి అన్యాయం జరిగినా, కేంద్రాన్ని ఎప్పుడూ నిలదీయని వైసిపి రఘురామ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు సందర్భంగా నానా హంగామా చేస్తోంది.ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని పట్టుబడుతూ, బీజేపీ పై యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
పైకి వీటి కోసమే తమ ఆందోళనను చెబుతున్నా, అంతిమంగా రఘురామపై వేటు వేయించేలా బీజేపీ పై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వైసిపి ఉన్నట్టుగా కనిపిస్తోంది.ఇప్పటికే బిజెపి కేంద్ర పెద్దలతో పాటు, స్పీకర్ కు అనేక సార్లు రఘురామ పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు చేశారు.
ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి.ఇక అనర్హత వేటు వేయాలా వద్దా అనేది పూర్తిగా స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.అయితే బిజెపి పెద్దలు కనుక వైసీపీ ఈ విషయంలో సానుకూలంగా ఉంటేనే వేటు పడుతుంది.భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జగన్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలి అంటే రఘురామ పై వేటు వేస్తేనే జగన్ శాంతిస్తారనేది బిజెపి పెద్దలకు బాగా తెలుసు.
ఏపీలో తమకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, జగన్ సహకారం తప్పనిసరి అవుతుందా అనే లెక్కల ఆధారంగా రఘురామ పై చర్యలు ఉంటాయి.అయితే వైసిపి మాత్రం ఎక్కువ కాలం వెయిటింగ్ చేసేలా కనిపించడం లేదు.
రఘురామపై వేటు వేసేందుకు ఆలస్యమైన క్రమంలో ఆయనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని, ఇప్పటికే ఆయనపై బ్యాంకులు సొమ్ము ఎగవేత కేసులో ఉండటంతో వాటిని వెలుగులోకి తెచ్చి ఆధారాలతో సహా ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.కనీసం ఆర్థికంగా రఘురామను ఇరుకున పెట్టే విషయంలో బిజెపి సహకరిస్తే జగన్ కు కాస్త ఊరట లభిస్తుంది.అనర్హత అయినా, ఆర్థికంగా దెబ్బ కొట్టాలన్నా, ఏదైనా కేంద్రం చేతిలో ఉండడంతో, వైసిపి బీజేపీ పై ఒత్తిడి పెంచే వ్యవహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు గానే కనిపిస్తోంది.