స్వప్నిక.ఈ పేరు వినగానే పలు టాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలలో నటించిన బొద్దుగుమ్మ గుర్తొస్తుంది.
అయితే స్వప్నిక కేవలం నటిగా మాత్రమే కాకుండా సినిమాల్లోకి రాక ముందు దర్శకత్వం విభాగంలో కూడా పని చేసింది.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి స్వప్నిక పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా ప్రస్తుతం తాను ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నట్లు తెలిపింది.
అయితే ఈ రెస్టారెంట్ వ్యాపారంలో తన భర్త తనకు చాలా సహాయం చేస్తాడని అందువల్లనే తన నటనా జీవితాన్ని మరియు వ్యాపార జీవితాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నానని తెలిపింది.
కాగా కరోనా లాక్ డౌన్ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఇళ్లకు తానే తన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని సప్లై చేసినట్లు తెలిపింది.అంతేకాక అత్యాధునిక ప్రమాణాలు పాటిస్తూ పరిశుభ్రంగా ఆహారాలను తయారు చేస్తామని అందువల్లనే తమ రెస్టారెంట్ వంటకాలకు మంచి గిరాకీ ఉందని తెలిపింది.
ఇక తన సినిమా జీవితం గురించి స్పందిస్తూ తాను సినిమా అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకి ఎవరు పెద్దగా తెలియదని దాంతో అవకాశాల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని తెలిపింది.ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో కనుక మనకి పరిచయస్తులు ఉంటే అవకాశాలు దక్కించుకోవడం మరింత సులభం అవుతుందని తన అభిప్రాయాన్ని తెలిపింది.
అంతేకాక తనకి దర్శకత్వం విభాగంలో పని చేయాలని ఎప్పటినుంచో కోరికగా ఉందని కాబట్టి కచ్చితంగా దర్శకత్వం వహిస్తానని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా స్వప్నిక ప్రస్తుతం చిత్రాలలో నటిస్తూనే మరో పక్క తెలుగులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సర్కారు వారి పాట” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోంది.కాగా ఈ విషయంపై కూడా స్వప్నిక స్పందిస్తూ గతంలో దర్శకుడు పరశురామ్ తో కలిసి పలు చిత్రాలలో పని చేశానని అందువల్లనే తనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినట్లు తెలిపింది.అయితే సర్కారు వారి పాట చిత్రం లో ఎమోషనల్ మరియు కమర్షియల్ కి సంబంధించిన సన్నివేశాలు బాగా హైలెట్ అవుతాయని చెప్పుకొచ్చింది.
దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.