తెలంగాణ ప్రజలంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో గులాబీ గూటికి కౌశిక్ వెళ్లడం వెనుక ఓ కీలక నేత హస్తమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.పాడి కౌశిక్ రెడ్డిని మొదటి నుంచి రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న ఆయన దగ్గరి బంధువు, కాంగ్రెస్ పార్టీలో కీలకనేతనే అతడిని టీఆర్ఎస్లోకి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఆయన సూచన మేరకే కౌశిక్ కాంగ్రెస్కు షాక్ ఇచ్చి గులాబీ గూటికి వెళ్లారనే చర్చ నడుస్తోంది.ఇదిలా ఉండగా బీజేపీ నుంచి హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ‘ప్రజాదీవెన యాత్ర’ పేరిట పాదయాత్ర జోరువానలోనూ కొనసాగిస్తున్నారు.
అయితే, ఆయనకు కూడా వ్యతిరేకత మొదలవుతున్నదనే వార్తలు వినిపిస్తున్నారు.మొత్తంగా టీఆర్ఎస్ అధిష్టానం ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని సీఎం వ్యాఖ్యలను బట్ట అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ‘దళిత బంధు’ తీసుకొస్తున్నట్లు కేసీఆర్ తేటతెల్లం చేసిన సంగతి అందరికీ విదితమే.ఈ సంగతులు అలా ఉంచితే పాడి కౌశిక్ రెడ్డి వల్ల టీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వర్గం, కేడర్ మొత్తం కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గట్టెక్కే అవకాశాలున్నాయి.మొత్తంగా కౌశిక్ రాజకీయ భవిష్యత్తు టీఆర్ఎస్లోనూ బాగానే ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.అయితే, అలా కౌశిక్ భవిష్యతు కోసం టీఆర్ఎస్ పార్టీలోని కొందరు కోవర్టులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తుంటారట కాంగ్రెస్ పార్టీలోని ఓ కీలక నేత.అయితే, మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నేతలతో టచ్లోనే ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఓ ఫంక్షన్కు కోసం వెళ్లిన క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కౌశిక్ కలిసిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత సలహాతోనే కౌశిక్ గులాబీ గూటికి చేరడం ఆసక్తికర పరిణామమని పలువురు అభిప్రాయపడుతున్నారు.