మూఢ నమ్మకాలపై అపారమైన నమ్మకం పెంచుకుని వింతైన వస్తువులను కట్నం కింద కావాలని అడగడంతో చివరకు జైలుపాలైన ఘటన మహారాష్ట్రలో జరిగింది.వివరాల్లోకి వెళితే.
ఔరంగాబాద్ పట్టణానికి చెందిన ఒక యువకునికి గత ఫిబ్రవరిలో తెలిసిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది.నిశ్చితార్థం సయమంలో వధువు యొక్క తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయలు, తులం బంగారంను కట్నకానుకలుగా ఇచ్చారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు పెళ్లికి సంబంధించిన పనులు చేసుకుంటుండగా, వరుడు వింతైన వస్తువులను కట్నంగా ఇవ్వాలని కోరాడు.కట్నం కింద మరొక పది లక్షల రూపాయలు కావాలని అడగడమే కాకుండా, బుద్ధ విగ్రహం, దీపం కుందేలు, 21 గోళ్లు కలిగిన తాబేలు, లాబ్రడార్ జాతికి చెందిన నలుపు రంగు కుక్కను కూడా కట్నం కింద ఇవ్వాలన్నాడు.
ఇలా చేయడం వల్ల మీ అమ్మాయికి పైళ్లైన తర్వాత తప్పకుండా ఉద్యోగం వస్తుందని వారిని నమ్మించడానికి ప్రయత్నించాడు.
అయితే, ఇలాంటి వింతైన వస్తువులను కట్నంగా అడగడంతో అక్కడ ఉన్న బంధువులు అందరూ అయోమయానికి గురయ్యారు.ఆ తర్వాత, ఇలాంటి వస్తువులను కట్నంగా అడగొద్దని, అయినా వీటిని వెతికి ఇవ్వడం తమ వల్ల కాదని వధువు తల్లిదండ్రులు వరుడిని కోరారు.అయినా కూడా వరుడు వస్తువులను తెచ్చి ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో, వధువు తరఫున కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో వరుడిపై కేసు పెట్టారు.
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వరుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.అంతే కాకుండా ఇలాంటి మూఢ నమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని, ఎవరైనా ఇలాంటి వస్తువులను కట్నం కింద అడిగినా లేదా వీటిని కొనడం వల్ల జీవితంలో మంచి జరుగుతుందని చెప్పినా పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.
ఇలాంటి వింత కోరికలు కోరితే ఇలాగే జరుగుతుందేమో మరి.