ఈ ప్రపంచంలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి.అయితే వాటిలో కొన్ని మాత్రమే మనకు తెలుసు.
కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి మనలో చాలామందికి తెలియదు.మన చుట్టూ ఉండే కొన్ని జీవుల గురించి మాత్రమే మనకు తెలుసు.
కానీ మనకి తెలియని జీవులు కూడా ఎన్నో ఉన్నాయి.అలాంటి ఒక వింత జలచరం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.
మన అందరికి చేపల గురించి బాగా తెలుసు.ఎందుకంటే చేపలను మనం కూర వండుకుని లొట్టలేసుకుంటూ తింటూ చేప రుచుకి ఫిదా అయిపోతాము కదా.అయితే మనకు తెలిసిన చేపలు జలచరాలు అంటే నీటిలో మాత్రమే నివసిస్తాయి.బయట ప్రపంచంలో బతకలేవు.
నీటిలో ఉంటేనే వాటికి మనుగడ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే కదా.
కానీ ఇప్పుడు చెప్పబోయే చేపలు మాత్రం నీటిలోనే కాకుండా బయట కూడా బతుకుతాయి.అలాగే కొండలు కూడా ఎక్కుతాయట.మరి ఆ చేపల వివరాలు ఒకసారి చూద్దామా.ఈ చేపలు హవాయి దీవుల్లో కనిపిస్తాయి.వీటిని ఓప్ చేపలు అని అంటారు.
ఈ చేపల స్పెషాలిటీ ఏంటంటే ఇవి జలపాతాలలోని రాళ్లపై పాకుతాయట.అలాగే సుమారు 300 మీటర్ల వరకు ప్రయాణించి కొండ ఎగువకు కూడా వెళతాయి.
ఈ ఓప్ చేపలకు నోరు, పొట్ట కింద రెక్కలు ఉంటాయి.ఈ చేపలకు ఉండే ఈ ప్రత్యేక అమరిక వలన అవి కొండలు సైతం అలవోకగా ఎక్కుతాయట.అంతేకాకుండా ఈ చేపలకు మరొక విశిష్టత ఉంది.అది ఏంటంటే కొండలు ఎక్కడంతో పాటు ఈ చేపలు అవసరాన్ని బట్టి రంగులు కూడా మారుస్తాయట.
సాధరణంగా ఈ చేపలు గోధుమ వర్ణంలో ఉంటాయి.అయితే ఊసరవెల్లిలాగా పరిసరాలకు అనుగుణంగా తమని తాము కాపాడుకోవడానికి రంగులు మార్చుకుంటాయట.
అలాగే., ఈ చేపలు ఒక అడుగు పొడవు వరకు పెరుగుతాయి.
అయితే ఆరు హవాయి దీవుల్లో ఈ రకం చేపలున్నాయట.కానీ ఎన్ని చేపలు ఉంటాయో అనే విషయంపై స్పష్టత లేదని పరిశోధకులు చెప్పారు.ఈ రకానికి చెందిన చేపలు మొత్తం 5 జాతులుగా ఉన్నాయి.వాటిలో నాలుగు జాతులకు చెందిన ఓప్ చేపలు రాళ్లపైకి పాకే ప్రత్యేక లక్షణం కలిగి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.