ఏపీలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పుంజుకునే అవకాశం లేదని, అందుకే బీజేపీలో ఆ పార్టీని విలీనం చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
టీడీపీకి జనసేన పార్టీ మద్దతు ఉంటే ఈపాటికి పరిస్థితి మరోరకంగా ఉండేదని, కానీ టిడిపి ఒంటరిగా మిగిలిపోవడం వల్ల రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోవడం కష్టమని, అలాగే భవిష్యత్తులో కలిగే ఇబ్బందులు అన్నీ దృష్టిలో పెట్టుకుని బాబు ఈ విలీన ప్రక్రియ దిశగా అడుగులు వేస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి.పొత్తు పెట్టుకుందామని ప్రయత్నిస్తున్నా బిజెపి జనసేన నుంచి ఎటువంటి సానుకూలత రాకపోవడం, అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఉండబోదు అంటూ బిజెపి నాయకులు స్వయంగా ప్రకటిస్తూ ఉండడంతో ఈ ఆందోళన మరింత పెరుగుతోంది.
బిజెపి వంటి జాతీయ పార్టీని వదిలి టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా లేరు.టిడిపితో పొత్తు పెట్టుకున్నా, తాను ఎప్పటి నుంచో కలలుకంటున్న సీఎం కుర్చీ తనకు దక్కదని, అదే బీజేపీతో ఉంటే తన కల నెరవేరుతుంది అనేది పవన్ అభిప్రాయం.
అందుకే బిజెపి తో ఇబ్బందులు ఎదురవుతున్నా, పవన్ సర్దుకుపోతూ వస్తున్నారు.తన రాజకీయ వారసుడు లోకేష్ కు రాబోయే రోజుల్లో లోకేష్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అంటే, బీజేపీతో పొత్తు పెట్టుకుని సీఎం పీఠం మాత్రం లోకేష్ కు దక్కేలా చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంలో బీజేపీ నుంచి బాగా ఒత్తిడి వస్తున్న క్రమంలో, మరి కొద్ది నెలల్లోనే ఈ విలీన ప్రక్రియ వ్యవహారం తెరపైకి వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఒకవేళ ఒంటరిగానే 2024 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే మళ్ళీ ఓటమి తప్పదని, అదే జరిగితే టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, అందుకే ఆ సాహసం చేసే కంటే బీజేపీలో టీడీపీని విలీనం చేసేయడమే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదే విషయమై ఏపీ మంత్రి కొడాలి నాని కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు.టిడిపి, బీజేపీ లో విలీనం కాబోతోందని, ఈ మేరకు చర్చలు జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉంది అంటూ ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
.