హుజురాబాద్ రాజకీయాలు ముదిరి ముదిరి పాకాన పడ్డాయి.ఇప్పటి వరకు ఇక్కడ పార్టీల వారీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా, ఇప్పుడు వ్యక్తిగత దూషణల వరకు ఇక్కడ నాయకులు వెళ్తున్నారు.
అంతే కాదు కొత్తగా హత్యాయత్నం అంటూ కొత్త వ్యవహారాలను తెరపైకి తీసుకొస్తున్నారు.ఇప్పటికే మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన విషయాలు బయట పెట్టారు.
తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, టిఆర్ఎస్ కు చెందిన ఓ మంత్రి హంతక ముఠాతో కలసి ప్లాన్ చేస్తున్నారని, ఈ విషయంపై స్పష్టమైన సమాచారం ఉందని సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేగింది.అయితే ఈ వ్యవహారం పై కరీంనగర్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.
ఈటెల ఆరోపణల్లో వాస్తవం లేదని, అవసరమైతే దీనిపై సమగ్ర విచారణ చేయించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ సవాల్ విసిరారు.ఓటమి భయంతోనే ఈటెల రాజేందర్ సానుభూతి కోసం ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
ఈ వ్యవహారం ఇలా ఉంది అనుకుంటే, హుజురాబాద్ కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత రేపు టిఆర్ఎస్ లో చేరబోతున్న పాడి కౌశిక్ రెడ్డి ఈటెల పై సంచలన ఆరోపణలు చేశారు.తనను చంపేందుకు ఈటెల రాజేందర్ 2018లో ప్లాన్ చేశారని ఆరోపించారు.2018లో మర్రిపల్లి గూడా గ్రామంలో తనను చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు.
రాత్రి 10 గంటల సమయంలో తాను ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా ఈ ప్లాన్ చేశారని, తాను అప్రమత్తంగా ఉండటంతో తప్పించుకున్నారని కౌశిక్ అన్నారు.హుజురాబాద్ లో ఎన్నో హత్య రాజకీయాలకు ఈటల పాల్పడ్డారని, టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ బాలరాజును 2014 జనవరి 5న నర్సింగ్ పూర గ్రామంలో హత్య చేశారని కౌశిక్ చెప్పుకొచ్చారు.ఇంత వరకు బాగానే ఉన్నా ఎప్పుడో 2018 లో కౌశిక్ పై ఈటెల హత్యాయత్నం చేయించేందుకు ప్రయత్నిస్తే ఆ వ్యవహారాన్ని ఇప్పుడు బయటపెట్టి విమర్శలు చేయడం రాజకీయ ఎత్తుగడ అని, టిఆర్ఎస్ మంత్రి పై ఈటెల రాజేందర్ ఆరోపణలు చేసిన క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అని ఈటల వర్గీయులు మండిపడుతున్నారు.