ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత శక్తివంతమైన అమెరికా నౌకాదళం చరిత్రలో ఓ మహిళ చరిత్ర సృష్టించింది.పురుషాధిక్యం తీవ్రంగా వుండే ఈ విభాగంలో ఓ మహిళ కఠోర శిక్షణను పూర్తి చేసి సెయిలర్గా నియమితురాలైంది.
స్పెషల్ వార్ఫేర్ కాంబాటెంట్-క్రాఫ్ట్ క్రూమాన్ (ఎస్డబ్ల్యుసిసి) గా మారడానికి ఆమె శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.ఎలైట్ యూఎస్ డిఫెన్స్ ఫోర్స్ గ్రూప్ సభ్యులు అత్యంత ప్రమాదకర కార్యకలాపాలలో నేవీ సీల్స్కు మద్ధతుగా వుంటారు.
పెంటగాన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ 37 వారాల శిక్షణను పూర్తి చేసిన ఆమె పేరును మాత్రం యూఎస్ నేవీ ప్రకటించలేదు.యూఎస్ మిలటరీ 2015లో మహిళలను త్రివిధ దళాల్లో చేర్చుకోవడం ప్రారంభించింది.
గత గురువారం 17 మంది నావికులు అసెస్మెంట్ అండ్ సెలక్షన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు యూఎస్ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.ఎస్డబ్ల్యూసీసీ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 35 శాతం మంది నావికులు మాత్రమే దీనిని పూర్తి చేయగలుగుతున్నారని అధికారులు చెబుతున్నారు.
37 వారాల పాటు ఎంతో కఠినంగా సాగే ఈ సెయిలర్ ఉద్యోగాల శిక్షణలో ఏటా 65 శాతం మంది మధ్యలోనే వదిలేసి వెళ్తుంటారు.ఇంతటి కఠినమైన శిక్షణ అందే ఉద్యోగానికి ఒక మహిళ ఎంపికై విజయవంతంగా పురుషులతో సమానంగా శిక్షణ పూర్తి చేసుకుని అమెరికన్ నేవీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నది.ఇప్పటివరకు ఈ సెయిలర్ ఉద్యోగాల కోసం 18 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా.14 మంది మధ్యలోనే వదిలి పారిపోయారు.మరో ముగ్గురు మహిళలు ఇంకా శిక్షణ పొందుతున్నారు.ఆయుధాల వాడకం, నావిగేషన్, స్పీడ్బోటింగ్ జారవిడవడం, సముద్రలోతుల్లో నుంచి ఆక్సిజన్ లేకుండా బయటకు రావడం, ప్యారాచూట్ జంపింగ్ వంటి కఠోర శిక్షణను ఎదుర్కోవాల్సి వుంటుంది.
అవన్నీ ఒక ఎత్తయితే చివరగా 72 గంటల పరీక్ష మరో ఎత్తు.ఈ పరీక్షలో ప్రతికూల పరిస్ధితుల్లో 23 గంటల పాటు రన్నింగ్, 5 మైళ్ల స్విమ్మింగ్ కూడా ఉంటుంది.ఇవి సెయిలర్స్ భౌతిక, మానసిక దృఢత్వాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి.ఈ శిక్షణలో క్వాలిఫై అయితేనే నేవీ సీల్స్ శిక్షణ పొందేందుకు అర్హత పొందుతారు.
నావల్ స్పెషల్ వార్ ఫేర్ శిక్షణ పూర్తి చేసిన తొలి మహిళకు యూఎస్ నావల్ స్పెషల్ వార్ఫేర్ కమాండ్ కమాండర్ రియర్ అడ్మిరల్ హెచ్డబ్ల్యూ హోవార్డ్ ప్రశంసించారు.ఆమె తమ సహచరురాలైనందుకు గర్వపడున్నానని ఆయన అన్నారు.
తన తోటి ఆపరేటర్ల మాదిరిగానే.తమ గ్రూపులో చేరేందుకు అవసరమైన ప్రతిభను ఆమె చూపిందని హోవార్డ్ పేర్కొన్నారు.