తెలంగాణ రాజకీయాలు పట్టు సాధించే దిశగా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలతో పాటు, తమకు రాబోయే రోజుల్లో పోటీ గా మారుతుంది అనుకున్న బిజెపి ని టార్గెట్ చేసుకుంటూ, ఆయా పార్టీల నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు.
దీంతో తెలంగాణలో రేవంత్ హవా రోజురోజుకు పెరుగుతున్నట్లుగా కనిపిస్తుండటం అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అయితే రేవంత్ ప్రభావం ఇంతగా పెరగడానికి పరోక్షంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరించిన తీరే కారణంగా కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్ వ్యవహారాలతో పాటు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ రేవంత్ అనేకసార్లు విమర్శలు చేశారు.అయితే రేవంత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టిఆర్ఎస్ ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాక జైలుకు పంపించింది.
దీంతో రేవంత్ ప్రభావం తెలంగాణలోనే కాకుండా, కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పెరిగింది.టిఆర్ఎస్ దూకుడుకు బ్రేక్ వేయగలిగే సమర్ధుడు రేవంత్ రెడ్డి మాత్రమే అనే అభిప్రాయము అందరిలోనూ కలిగింది.
ఆ అభిప్రాయం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యేందుకు దోహదం చేసింది.ఇప్పుడు ఆ హోదాలోనే తెలంగాణా లో పర్యటించి టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన కోక పేట భూముల వ్యవహారంపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై రేవంత్ అనేక విమర్శలు చేస్తున్నారు.
ఈ భూ వ్యవహారంలో దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని, ఎకరం 60 కోట్లకు అమ్ముడు అవ్వాల్సిన భూమిని 40 కోట్లకు మాత్రమే అమ్మారు అంటూ రేవంత్ సంచలన విమర్శలు చేస్తున్నారు.
ఈ భూములు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువగా కెసిఆర్ బంధువులు, సన్నిహితులు ఉన్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తాను బయట పెడతానంటూ రేవంత్ హడావుడి చేస్తున్నారు.అక్కడితో ఆగకుండా ఈ కోకాపేట భూముల వ్యవహారం పై నిగ్గు తేల్చేందుకు పార్టీ నేతలు జగ్గారెడ్డి , దామోదర రాజనరసింహ, మహేష్ గౌడ్ నేతృత్వంలోని పిసిసి కమిటీ తో కలిసి వెళ్లేందుకు సిద్ధం అవ్వగా, రేవంత్ ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.
దీంతో రేవంత్ ఆరోపణలు నిజం ఉందని, అందుకే టీఆర్ఎస్ ఇంతగా కంగారు పడుతుంది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.తెలంగాణలో క్రమక్రమంగా రేవంత్ బలం పెంచుకునేందుకు, పరోక్షంగా టిఆర్ఎస్ కారణమవుతోంది.రేవంత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని యాక్షన్ ప్లాన్ లోకి దిగుతుండడంతో ఆయనకు జనాల్లో సింపతి పెరిగి, అది ఆయనకు రాజకీయ బలం పెరిగేలా చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.