తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారబోతున్నట్టుగా కనిపిస్తోంది.ఇక్కడి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్న ఈటెల రాజేందర్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోవడం తో హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివార్యం అవుతున్నాయి.
అయితే ఇక్కడి నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంలో టిఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది.ఎందుకంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ బలమైన వ్యక్తి కావడంతో పాటు, మొదటి నుంచి ఈ నియోజకవర్గంపై పట్టు ఉండడం, రాష్ట్రవ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపు ఉండటం, కొన్ని ప్రధాన సామాజిక వర్గాల అండదండలు తదితర పరిణామాలతో ఆయనను ఢీ కొట్టగల అభ్యర్థి కోసం టిఆర్ఎస్ వెతుకుతోంది. ఇప్పటికే అనేక మంది పేర్లు తెరపైకి వచ్చినా, ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఎటు తేల్చుకోలేక సర్వేలు చేయిస్తోంది.ఈ సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని చూస్తుండగా, ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలామంది నాయకులే పోటీపడుతున్నారు.
పూర్తిగా కాంగ్రెస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్న పాడి కౌశిక్ రెడ్డి, టిఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, టీఎస్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, లక్ష్మీ కాంతారావు కుటుంబం నుంచి ఒకరు, అలాగే మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన పురుషోత్తం రెడ్డి, దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యప్ రెడ్డి, ఇలా ఎంతోమంది నేతల పోటీపడుతున్నారు.
అలాగే బిజెపి నుంచి టిఆర్ఎస్ లో చేరి హుజరాబాద్ లో పోటీ చేయాలని చూస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అలాగే నేడు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరబోతున్న ఎల్.రమణ, ఇలా చాలా మంది పేర్లు పోటీలో వినిపిస్తున్నాయి.అయితే వీరిలో చాలామంది అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం, పార్టీ కేడర్ ను కలుపుకొని జనాల్లోకి వెళ్తుండటం, టికెట్ తమదే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ ఉండటం ఇవన్నీ టిఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి.
ఎవరో ఒకరికి టికెట్ దక్కకపోతే గ్రూపు రాజకీయాలకు పాల్పడతారు అనే భయము టిఆర్ఎస్ ను వెంటాడుతోంది.
.