జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అటువంటిది.ఏపీలో రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న పవన్ బిజెపి సహకారంతో 2024లో అధికారంలోకి రావాలని చూస్తున్నారు.
అసలు 2019లోనే ఆ తరహా ప్రయత్నాలు పవన్ చేసినా, జనాలు రిసీవ్ చేసుకోకపోవడంతో పవన్ ప్రయత్నాలు ఫలించలేదు.అయితే 2024 నాటికి తప్పనిసరిగా అధికారంలోకి రావాలని, లేకపోతే ఇక జనసేన ను పూర్తిగా మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనే భయం పవన్ లో ఉంది.
ఆ భయంతోనే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ యాక్టివ్ గా ఉంటూ ఏపీ రాజకీయాల్లో హడావుడి చేశారు.
వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమే కాకుండా , అనేక ప్రజా పోరాటాలు చేపట్టాడు.
ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోవడం, ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అయి పోవడం, మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, అక్కడ బిజీగా మారిపోవడంతో జనసేన పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ కు వచ్చింది.అప్పుడప్పుడు జనసేన తరపున ప్రెస్ నోట్ లు రిలీజ్ కావడం, సోషల్ మీడియా ద్వారా పవన్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం మినహా పెద్దగా కార్యక్రమాలు లేకపోవడం నిరాశ కలిగిస్తుంది.
ప్రజా పోరాటాలు ప్రభుత్వంపై విమర్శలు సంగతి కొంతకాలం పక్కన పెట్టి జనసేన ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా పార్టీ నాయకులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, జనసేన పెంచుకోవాల్సిందే.
కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అయింది అన్నట్లుగా క్షేత్రస్థాయిలో అభిప్రాయం ఉండడంతో, ఆ అభిప్రాయం చేరుపుకునే విధంగా అన్ని సామాజిక వర్గాల కు దగ్గర అయ్యే విధంగా పవన్ వ్యూహాలు రచించుకోకపోతే రాబోయే రోజుల్లో జనసేన పరిస్థితి మళ్లీ 2019 మాదిరిగానే అవుతుందనేది ఆ పార్టీ నాయకుల భయం.ఇప్పటికైనా పవన్ హైదరాబాద్ ను వీడి ఏపీ లో మకాం వేసి పరిస్థితిని చక్కదిద్దాలి అనేది పవన్ అభిమానుల ఆకాంక్ష గా కనిపిస్తోంది.