అప్పుడప్పుడు హుషారు.ఎప్పుడూ నిరాశ అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.
చెప్పుకోవడానికి ఆ పార్టీలో పేరున్న జాతీయ స్థాయి నాయకులు చాలామంది ఉన్నారు.రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు అనేక మంది ఉన్నారు.
అయినా ఎప్పుడు విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతూ ఉంటుంది.ఇక నాయకులు ఎక్కువగా ఉండటంతో వారి సీనియారిటీ పరపతి ఆధారంగానే పార్టీ పదవులు దక్కాయి.
అయితే పదవులు దక్కినా, విధులు ఏ విధంగా నిర్వహించాలో తెలియని పరిస్థితుల్లో అలంకారప్రాయంగా మాత్రమే వాటిని చూడాల్సిన పరిస్థితి వారికి వచ్చి పడింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో పార్టీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ లు ఉండేవారు.
పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి , అజారుద్దీన్.అయితే ఈ ముగ్గురు లో ఎవరెవరు ఏ పనులు చేయాలి పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో సరైన క్లారిటీ లేక పోవడంతో ఎవరికి వారు సైలెంట్ గానే ఊరుకుంటూ వస్తున్నారు.
ఇదే విషయమై గత కొంతకాలం క్రితం పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి పై ఒత్తిడి చేసినా ప్రయోజనం కలగలేదు.గాంధీభవన్ లో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపించినా అది సాధ్యపడక పోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు.
రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోయినా, అజారుద్దీన్ మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు.కేవలం సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు, అప్పుటి ఎన్నికలలో గట్టెక్కేందుకు మాత్రమే పదవులను ఇచ్చాము అంతే అన్నట్లుగా అధిష్టానం ఈ వ్యవహారాలను లైట్ తీసుకోవడంతో , తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి పదవులు పొందిన నేతల్లో ఉంది.
తాజాగా కొత్త పిసిసిలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను నియమించారు.అయితే ఈ ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లకు కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్ పని విభజన చేసి, ఐదుగురికి సమానంగా బాధ్యతలు అప్పగిస్తారా లేక గత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ మాదిరిగానే సైలెంట్ గానే ఉండి పోతారా అనే వ్యవహారమే తేలాల్సి ఉంది.ప్రస్తుతం పిసిసి కార్యవర్గంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యదవ్ , అజారుద్దీన్, మహేష్ గౌడ్ ఉన్నారు.ఇందులో ఒకరిద్దరు తప్ప మిగతా అంతా యాక్టివ్ గా ఉంటూ రాజకీయ సమీకరణాలు మార్చగల వ్యక్తులే.
అయితే వీరికి ఎంతవరకు రేవంత్ ప్రాధాన్యం ఇస్తారు అనేదే తేలాల్సి ఉంది.